Pakistan : ఇండియన్ సినిమాలు రిలీజ్ అవ్వకపోతే.. పాక్లో సినీ పరిశ్రమ బ్రతకదు.. పాక్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
ఇండియన్ సినిమాలు రిలీజ్ అవ్వకపోతే పాక్ సినీ పరిశ్రమ బ్రతకదు అంటూ పాక్ నటుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Pakistan actor Faysal Quraishi viral comments on Indian cinema releases in his country
Pakistan : ప్రస్తుతం ఇండియన్ సినిమాలకు ఇంటర్నేషనల్ వైడ్ ఆదరణ పెరుగుతుంది. భారతీయ కథలను తెలుసుకోవడానికి ప్రపంచ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలోనే పలు దేశాల్లో మన సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. కానీ మన పొరుగు దేశం పాకిస్తాన్ లో మాత్రం.. ఇండియన్ సినిమాల పై బ్యాన్ విధించి కూర్చున్నారు. తాజాగా ఈ విషయం గురించి పాక్ నటుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ పాకిస్తానీ నటుడు మరియు నిర్మాత ఫైసల్ ఖురేషీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. “పాకిస్తాన్లో సినిమా పరిశ్రమ బ్రతికి ఉండాలంటే ఇండియన్ మూవీ రిలీజ్లు పై పాక్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే తొలిగించాలి. నాకు నా దేశం పై భక్తి ఉంది. కానీ పాకిస్తాన్ లో సినిమా పరిశ్రమ కొనసాగాలంటే ఇండియన్ మూవీస్ ని రిలీజ్ చేయడం చాలా ముఖ్యం” అంటూ చెప్పుకొచ్చారు.
Also read : ET20 : చాలా పాఠాలు నేర్చుకున్నా అంటూ బన్నీ.. బాలీవుడ్ దర్శకుడితో చరణ్.. హిస్టారిక్ ఇయర్ అంటూ చిరు..
“ఎందుకంటే ఇక్కడ ప్రజలకి ఆ చిత్రాల పై ఎంతో ఆసక్తి ఉంది. భారతీయ సినిమాల రిలీజ్లు వల్ల గతంలో పాకిస్తాన్ ఏడాదికి దాదాపు 6000 కోట్లకు పైగా ఆర్జించేది. పాకిస్తాన్ ప్రజలు ఇండియన్ సినిమాలు రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు. ఆ ఆసక్తితోనే ఇక్కడ ప్రజలు ఓటీటీలో ప్రతి ఇండియన్ సినిమాని ఆదరిస్తున్నారు. ఈ విషయాలు ఇక్కడ అందరికి తెలుసు” అని వెల్లడించారు.
“భారతీయ సినిమాల విడుదల పై నిషేధం ఎత్తివేస్తే.. ఇక్కడ పరిశ్రమకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు భారత్తో మన సంబంధాలను మెరుగుపరిచేందుకు కూడా సహాయ పడుతుంది. మన కంటెంట్ ని కూడా ఆ దేశంలో స్ట్రీమింగ్ చేసేందుకు అవకాశం దొరుకుతుంది” అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాగా 2019 నుంచి పాకిస్తాన్ థియేటర్ల్లో భారతీయ సినిమాల విడుదల పై నిషేధం వేశారు.