African Cheetah: ఆఫ్రికన్ చిరుతలు వచ్చేస్తున్నాయ్.. 17న కునో పార్కులో ల్యాండ్ కానున్న ఎనిమిది చిరుతలు..
దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల నుంచి చిరుత పులులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో పాల్పూర్ జాతీయ పార్కుకు దశలవారీగా దిగుమతి చేయనున్నారు. ఈవారం చివర్లో నమీబియా రాజధాని విండ్హోక్ నుండి ఎనిమిది చిరుతలు ఇండియా రానున్నాయి.

African cheetah
African Cheetah: విదేశాల నుంచి అరుదైన చిరుత పులులను మన దేశానికి తీసుకొచ్చి పునరుత్పత్తి ప్రాజెక్ట్కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల నుంచి చిరుత పులులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో పాల్పూర్ జాతీయ పార్కుకు దశలవారీగా దిగుమతి చేయనున్నారు. ఈవారం చివర్లో నమీబియా రాజధాని విండ్హోక్ నుండి ఎనిమిది చిరుతలు ఇండియా రానున్నాయి. చార్టర్డ్ బోయింగ్ 747 కార్గో విమానంలో వీటిని తీసుకురానున్నారు. వచ్చే శుక్రవారం విండ్హోక్లో బయలుదేరి 10గంటల ప్రయాణ సమయం అనంతరం జైపూర్లో దిగుతాయి. అక్కడి నుండి వాటిని హెలికాప్టర్లో 40 నిమిషాల వ్యవధిలో కునో నేషనల్ పార్క్ (కేఎన్పీ)కు సెప్టెంబర్ 17న తరలిస్తారు. అయితే వాటిని ప్రత్యేక ‘క్వారంటైన్’ ఎన్క్లోజర్లోకి ప్రధాని నరేంద్ర మోదీ, అధికారుల పర్యవేక్షణలో విడుదల చేస్తారని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Girl Saved: బాబోయ్..! క్షణం ఆలస్యమైనా చిన్నారి ఊపిరి ఆగేది.. ఈ వీడియోను చూస్తే చెమటలు పట్టాల్సిందే..
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా చిరుతలను ఎన్క్లోజర్ లోకి విడుదల చేయడం జరుగుతుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ గత నెలలో చెప్పిన విషయం విధితమే. ఎనిమిది ఆఫ్రికన్ చిరుతల్లో ఐదు ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి. అయితే ఈ చిరుతలు నాలుగు నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవిగా అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ జిల్లా (కునో ఉన్న ప్రదేశం) దక్షిణాఫ్రికా, నమీబియా మాదిరిగానే వర్షపాతం స్థాయిలు, ఉష్ణోగ్రతలు, ఎత్తు, పరిస్థితులను కలిగి ఉంది. అందుకే ఆ ప్రాంతాల నుంచి తరలించే చిరుతలను కునో పాల్పూర్ జాతీయ పార్కులో ఉంచనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,000 చిరుతలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో దాదాపు 4,500 నివసిస్తున్నాయి. భారతదేశం ఈ సంవత్సరం 20 ఆఫ్రికన్ చిరుతలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. నమీబియా నుండి ఎనిమిది, దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలు తీసుకురానున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు గతంలో తెలిపారు. నమీబియా నుంచి ఎనిమిది చిరుతలు ఈనెల 17న ఇండియాకు చేరుకుంటాయి. దక్షిణాఫ్రికా నుంచి రావాల్సిన చిరుతల విషయంలో.. భారతదేశం నుండి ఈమేరకు ప్రయత్నాలు పూర్తయినప్పటికీ దక్షిణాఫ్రికా అధికారుల సమ్మతి కోసం వేచి చూస్తున్నారు. నమీబియాలోని చిరుతల మాదిరిగానే దక్షిణాఫ్రికా నుండి ఇండియాకు తీసుకొచ్చే చిరుతలను కూడా ప్రయాణానికి ఇప్పటికే సిద్ధం చేశారు.