2 వారాల్లో రూ.2.67 కోట్లు : లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు జరిమానా

కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే… కొంతమంది పోకిరీలు పనీ పాటా లేకుండా రోడ్లపై కి వచ్చి ద్విచక్ర వాహానాలతో స్వైర విహారం చేయటం మొదలెట్టారు. గత రెండు వారాల్లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి బీహార్ పోలీసులు రూ. 2.67 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారు. లాక్ లాక్డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘించిన 500 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన 11,000కు పైగా వాహనాలను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 723 లాక్డౌన్ ఉల్లంఘనలను నమోదు చేసినట్టు బీహార్ పోలీసులు తెలిపారు. బక్సర్, గయా, సుపౌల్, భాగల్పూర్ జిల్లాల్లో లాక్డౌన్ ఉల్లంఘించిన వారిని గుర్తించేందుకు పోలీసులు డ్రోన్లు ఉపయోగించారు.
జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉల్లంఘనులను స్పాట్లో గుర్తించేందుకు తాము డ్రోన్లను ఉపయోగించామని, లాక్డౌన్ సమయంలో ఇళ్ల దగ్గరే ఉండాలని వారిని హెచ్చరించి వదిలివేశామని సరన్ ఎస్పీ ఆశిష్ భారతి చెప్పారు. ప్రజలు సామాజిక దూరం పాటించి లాక్డౌన్ను కఠినంగా అమలు చేయడంలో డ్రోన్లు తమకు సహకరించాయని చెప్పారు. లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించిన ప్రజలను కట్టడి చేసేందుకు బీహార్ రాజధాని పట్నాలో పలు ప్రాంతాల్లో పోలీసులు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది.