Unnao Victim : మోదీకి ఉన్నావ్ బాధితురాలి లేఖ..అభ్యర్థిని మార్చిన బీజేపీ
ఉత్తర్ప్రదేశ్ లో జులై 3న జరగనున్న ఉన్నావో జిల్లా పంచాయత్ చైర్మన్ ఎన్నికకు ప్రకటించిన తమ అభ్యర్థిని(అరుణ్ సింగ్) గురువారం బీజేపీ మార్చివేసింది.

Bjp
Unnao Victim ఉత్తర్ప్రదేశ్ లో జులై 3న జరగనున్న ఉన్నావో జిల్లా పంచాయత్ చైర్మన్ ఎన్నికకు ప్రకటించిన తమ అభ్యర్థిని(అరుణ్ సింగ్) గురువారం బీజేపీ మార్చివేసింది. ఉన్నావ్ రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్కు అరుణ్ సింగ్ సన్నిహితుడని.. బాధితురాలు ఆరోపణలు చేయడమే కాకుండా అతనితో తనకు ముప్పు ఉందని ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖలు పంపించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థిని మార్చివేస్తూ గురువారం పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని బీజేపీ చెబుతూనే నా తండ్రిని చంపిన వారికి పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కుల్దీప్ సింగ్కు ప్రభుత్వం ఇప్పటికీ మద్దతుగానే నిలుస్తోంది. అరుణ్ సింగ్కు పార్టీ టికెట్ ఇస్తే నా ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. అరుణ్ సింగ్ స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా అని ఉన్నావ్ బాధితురాలు ఆరోపించింది.
అయితే, అరుణ్ సింగ్ పై ఉన్నావ్ బాధితురాలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ కిశోర్ రావత్ ఇటీవల ఆరోపించారు. కానీ పార్టీ నిర్ణయం మేరకు అరుణ్ సింగ్ నామినేషన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే అజిత్ సింగ్ భార్య షకున్ సింగ్ ని పార్టీ తరపున జిల్లా పంచాయత్ చైర్మన్ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలిపారు.