పెట్టుబడిదారుల డబ్బుతో పరారీ..గుడ్ విన్ జ్యూవెలర్స్ ఓనర్స్ పై కేసు నమోదు

కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లను మోసం చేసి బిచాణా ఎత్తేసిన గుడ్విన్ జ్యువెల్లరీ సంస్థ యజమానులు సునీల్ నాయర్,సుధీర్ నాయర్ లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకర్షణీయ వడ్డీ, ఇతర ఆఫర్లతో ఆకట్టుకుని, పెద్దమొత్తంలో డబ్బులు దండుకుని పారిపోయారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన 300మంది పెట్టుబడిదారులు శనివారం ముంబైలోని దొంబివాలీ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. జ్యూవెలరీ స్టోర్ ని సీజ్ చేసినట్లు దొంబివాలీ పోలీస్ స్టేషన్ లో సీనియర్ పోలీస్ ఇన్స్ పెక్టర్ సురేష్ తెలిపారు.
అయితే అక్టోబర్ 21నుంచే యజమానులు ఇద్దరూ పరారీలో ఉన్నారు. షాపులను మూసివేసి కుటుంబ సభ్యులతో సహా ఉడాయించారనీ, నిందితుల పాస్పోర్ట్ వివరాలను సేకరిస్తున్నామనీ, లుక్ అవుట్ నోటీసులు జారీకి యోచిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రభుత్వ రైల్వే పోలీసులను, పోలీసు కంట్రోల్ రూమ్ను అప్రమత్తం చేశామన్నారు. గుడ్విన్ జ్యువెలర్స్ డొంబివ్లి బ్రాంచ్ మేనేజర్ మనీష్ కుండిపై కూడా కేసు నమోదు చేశామనీ, నిందితులు పరారీలో ఉన్నారని సురేష్ అహెర్ తెలిపారు.
ఒక్క డొంబివ్లి శాఖలోనే వెయ్యిమంది దాకా ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. బాధితులు ఒక్కొక్కరు 13 లక్షల నుండి కోటి రూపాయల మధ్య పెట్టుబడి వుంటారనా అనుమానం. ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నాయనీ, దీంతో ఈ కేసు ఫిర్యాదులను స్వీకరించడానికి మాత్రమే ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించామని తెలిపారు.
కేరళకు చెందిన గుడ్విన్ జ్యుయలరీ గ్రూప్ కు థానే, నవీముంబై సహా ముంబైలో 13 బ్రాంచీలున్నాయి. వీటిలో చాలావరకు ఇప్పుడు మూసివేశారు. బాధిత పెట్టుబడిదారుల్లో కేరళనుంచి వచ్చి ముంబైలో స్థిరపడిన వారే ఎక్కువని భావిస్తున్నారు.