మోడీ ప్రసంగం ప్రసారం చేయలేదని..డీడీ అసిస్టెంట్ డైరక్టర్ సస్పెండ్

సెప్టెంబర్ 30,2019న మద్రాస్ ఐఐటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొని ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోడీ ఐఐటీ మద్రాస్లో చేసిన ప్రసంగం ప్రసారాన్ని నిలిపివేసినందుకు చెన్నై దూరదర్శన్ కేంద్రం డీడీ పొదిగై టీవీ అధికారిపై ప్రసార భారతి వేటు వేసింది. ఉద్దేశ్యపూర్వకరంగానే ప్రధాని ప్రసంగం ప్రసారాన్ని డీడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ వసుమతి అడ్డుకున్నారనే అభియోగాలపై ఆమెను ప్రసారభారతి సస్పెండ్ చేసింది.
ఈ కార్యక్రమానికి ముందు ఈ ఈవెంట్ను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సి ఉందా అని అసిస్టెంట్ డైరెక్టర్ వసుమతి తన ఉన్నతాధికారులకు ఈమెయిల్ చేయగా ప్రధాని ప్రసంగాన్ని లైవ్ ఇవ్వాలని వారు బదులిచ్చినట్టు ప్రసార భారతి వర్గాలు తెలిపాయి. స్పష్టమైన ఉత్తర్వులున్నా అసిస్టెంట్ డైరెక్టర్ వసుమతి ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయరాదని నిర్ణయం తీసుకున్నారని ప్రసార భారతి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
వసుమతిని సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో కారణం తెలుపకపోయినా ప్రధాని ప్రసంగం వ్యవహారంపైనే ఆమెపై చర్యలు చేపట్టినట్టు తెలిసింది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు 1965 కింద వసుమతిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రసార భారతి తెలిపింది.