Dearness Allowance Hike : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు..!
Dearness Allowance Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపుకబురు అందించింది. డియర్నెస్ అలవెన్స్ 4 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 50 శాతానికి చేరుకుంది.
![Dearness Allowance Hike : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు..! Dearness Allowance Hike : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు..!](https://10tv.in/wp-content/uploads/2024/03/DA-hiked-by-4-per-cent-points-to-50-Percent-for-government-employees.jpg)
DA hiked by 4 per cent points to 50 Percent for government employees
Dearness Allowance Hike : లోక్ సభ ఎన్నికలకు ముందుగానే కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4శాత డీఏను పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏ విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం (మార్చి 7) సమావేశమైన కేంద్ర కేబినేట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ను, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ను ఈ ఏడాది జనవరి 1 నుంచి 4 శాతం పాయింట్లు పెంచినట్లు ఆయన వెల్లడించారు.
జనవరి నుంచే పెరిగిన డీఏ వర్తింపు :
ఈ పెంపుతో డీఏ ప్రస్తుతం ఉన్న 46 శాతం నుంచి బేసిక్ పేలో 50 శాతానికి చేరుతుంది. చివరి డీఏ పెంపు అక్టోబర్ 2023లో 4 శాతం పెంపుతో 46 శాతానికి పెరిగింది. 2024 జనవరి నుంచి పెరిగిన డీఏ ఉద్యోగులకు వర్తించనుంది. డీఏ పెంపుతో రూ.12,868.72 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.
వచ్చే నెల జీతంలో ఎరియర్స్ కలిపి కేంద్రం చెల్లించనుంది. కేబినెట్ నిర్ణయాలతో లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. అంతేకాదు.. ఇండియా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) మిషన్ ఏర్పాటు కోసం రూ.10వేల (10,371.92) కోట్ల విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ముడి జనపనార మద్దతు ధర రూ. 285 పెంపు :
మరోవైపు.. 2024-25 సీజన్ కి సంబంధించి ముడి జనపనారకు మద్దతు ధర రూ. 285కు పెంచింది. ముడి జనపనారకు క్వింటాల్ రూ.5,335 ఎంఎస్పీగా నిర్ధారించింది. ఎఎల్హెచ్ ధృవ్ హెలికాప్టర్ల కొనుగోలుకు కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సైన్యం, కోస్ట్ గార్డ్ కోసం 34 ఎఎల్హెచ్ ధృవ్ హెలికాప్టర్లను కొనుగోలు చేస్తోంది. భారత సైన్యం కోసం 25 ఎఎల్హెచ్ ధృవ్ హెలికాప్టర్లను కొనుగోలు చేయనుంది. భారత తీర రక్షక దళం కోసం తొమ్మిది హెలికాప్టర్లను కొనుగోలు చేయనుంది. ధృవ్ హెలికాప్టర్లను ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ నిర్మిస్తోంది.
సిలిండర్పై రూ.300 రాయితీ కొనసాగింపు :
ఉజ్వల్ పథకం రాయితీ గడువును పొడిగించింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్కీమ్ ఉజ్వల యోజన ద్వారా అందిస్తున్న రూ.300 సబ్సిడీ పథకాన్ని 2025, మార్చి 31 వరకు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉజ్వల లబ్దిదారులకు సిలిండర్పై రూ.300 రాయితీని కేంద్రం అందిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ రాయితీ వర్తించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Read Also : Chandrababu Naidu : క్లైమాక్స్లో పొత్తు..! ఢిల్లీకి చంద్రబాబు, బీజేపీ అగ్రనేతలతో కీలక సమావేశం