తుఫాన్ ఎఫెక్ట్ : ఒడిషాలో స్ట్రాంగ్ రూమ్ ల నుంచి EVMలు తరలింపు

  • Published By: venkaiahnaidu ,Published On : May 1, 2019 / 12:06 PM IST
తుఫాన్ ఎఫెక్ట్ : ఒడిషాలో స్ట్రాంగ్ రూమ్ ల నుంచి EVMలు తరలింపు

Updated On : May 28, 2020 / 3:41 PM IST

ఫోని తుఫాన్ హెచ్చరికల కారణంగా ఒడిషాలోని రెండు జిల్లాల్లో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన EVMలను వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. 11 జిల్లాల్లో ఫోని తుఫాన్ భీభత్సం సృష్టించే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. దీంతో EVMలు భధ్రపరిచి ఉన్న స్ట్రాంగ్ రూముల్లోకి నీరు వెళ్లి ఈవీఎంలు పాడయ్యే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ఈసీ ఆదేశాలతో జగత్ సింగ్ పూర్, గజపతి జిల్లాల్లోని EVMలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఒడిషా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సురేంద్ర కుమార్ తెలిపారు.
Also Read : ఒడిశాలో హై అలర్ట్ : స్కూళ్లు, కాలేజీలు మూసివేత.. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు

అభ్యర్థుల పర్యవేక్షణలోనే మొత్తం EVMల తరలింపు ప్రక్రియ జరుగుతుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా తరలింపు ప్రకియ మొత్తం వీడియో రికార్డింగ్ చేయబడుతుందని వివరించారాయన. EVM తరలింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన. రాష్ట్ర, కేంద్ర పోలీస్ ఫోర్సెస్ తో కూడిన జాయింట్ టీమ్ EVMలు, వీవీప్యాట్లను తరలించే వాహనాల వెంట ఉంటుంది. ప్రతి ఒక్క సెంటర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఈ వాహనాల వెంట ఉంటారు.

దక్షిణ పూరి ప్రాంతంలో మే 3, 2019వ తేదీన తుఫాను తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటే సమయంలో.. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఒడిశాలోని 11 జిల్లాల్లోపై తుఫాన్ ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

ఫోని తుఫాన్ వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని.. ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరడంతో కోడ్ ఎత్తివేస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 11 తీర ప్రాంత జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ ను ఎత్తివేశారు.
Also Read : పెను తుఫాన్ గా ఫోని : తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో గాలులు