బీజేపీ నాయకుడు “స్వామి”పై లైంగిక ఆరోపణలు..యువతి అదృశ్యం

మూడు రోజుల క్రితం బీజేపీ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి స్వామి చిన్మయానంద్ పై ఫేస్ బుక్ లైవ్ ద్వారా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన 23ఏళ్ల లా విద్యార్థిని అదృశ్యం కేసులో చిన్మయానంద్ పై ఉత్తరప్రదేశ్ లోని షాజహన్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువతిని కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరించినట్లు స్వామి చిన్మయానంద్ పై ఆరోపణలు ఉన్నాయి. కాలేజీ హాస్టల్ నుంచి తమ కుమార్తె అదృశ్యమైందనీ, చిన్మయానందే దీనికి కారణమంటూ కుటుంబ సభ్యులు షాజహన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎప్పుడూ తనతో చెప్పలేదనీ, అయితే రక్షాబంధన్కు ఇంటికి వచ్చినపుడు ఆందోళనగా కనిపించిందని యువతి తండ్రి చెప్పారు. కి
కిడ్నాప్ కు గురైన యువతి లా చదువుతున్న ఎస్ఎస్ పోస్ట్ గ్రాడ్యేయేట్ కాలేజీ చైర్ పర్శన్ గా కూడా స్వామి చిన్మయానంద ఉన్నారు. కిడ్నాప్ అయిన యువతిని రక్షించేందుకు,నిందితుడు స్వామిని పట్టుకునేందుకు ఇప్పటికే పోలీస్ టీమ్ లను రంగంలోకి దించామని, యువతి కుటుంబానికి సెక్యూరిటీని కల్పించినట్లు షాజహన్పూర్ ఎస్పీ ఎస్. చెన్నప్ప తెలిపారు.
స్వామి చిన్మయానంద…ఇప్పటికే చాలామంది అమ్మాయిల జీవితం నాశనం చేశాడు. తనను కూడా బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ ఎల్ఎల్ఎం (పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లా) విద్యార్థిని ఫేస్బుక్ లైవ్ చేసింది. సన్యాసి రూపంలో ఉన్న ఆయన పోలీసు ఉన్నతాధికారులు తన చెప్పు చేతల్లో పెట్టుకుని, తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరిస్తూ వుంటాడని వాపోయింది. తనకు, తన కుటుంబానికి ముప్పు ఉందని కన్నీటి పర్యంతమైంది. దీనికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోవాని, తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శనివారం నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఇది ఇలా వుంటే రూ .5 కోట్లు డిమాండ్ చేస్తూ గుర్తు తెలియని వ్యక్తులనుంచి కాల్ వచ్చిందంటూ స్వామి చిన్మయానంద్ మద్దతుదారులు, కాలేజీ యాజమాన్యం కూడా కౌంటర్ ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో కూడా స్వామిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. 2011 నవంబరులో ఆయన ఆశ్రమంలోని యువతి ఆరోపణలతో దాడి, రేప్, బలవంతపు అబార్షన్, హత్యాప్రయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. అయితే ఏడేళ్ల తరువాత గత ఏడాది ఏప్రిల్లో ఈ కేసును ఎత్తివేస్తూ యోగి సర్కారు సంచలన నిర్ణయం తీసుకోగా, దీనికి వ్యతిరేకంగా బాధితురాలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాసిన విషయం తెలిసిందే.