మీ అబ్బాయి మనసు మార్చండి..మోడీ తల్లికి పంజాబ్ రైతు విజ్ణప్తి

Farmer’s Emotional Appeal to PM Modi’s Mother on Agri Laws నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. రైతు సంఘాల నాయకులు-ప్రభుత్వం మధ్య జరిగిన 11రౌండ్ల చర్చలు కొలిక్కిరాకపోవడంతో వారు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పంజాబ్కు చెందిన ఓ రైతు ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీకి ఓ భావోద్వేగ లేఖ రాశారు. ఆ చట్టాలను రద్దు చేసేలా మీ అబ్బాయి మనసు మార్చండి అంటూ ఆ లేఖలో మోడీ తల్లిని రైతు కోరారు.
పంజాబ్ ఫిరోజ్పూర్ జిల్లాలోని గోల్ కా మోద్ గ్రామానికి చెందిన హర్ప్రీత్ సింగ్ అనే రైతు మోడీ తల్లికి హిందీలో రాసిన లేఖలో…నేను చాలా బరువైన హృదయంతో ఈ లేఖను రాస్తున్నాను. దేశానికి, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తున్న అన్నదాతలు ఢిల్లీలోని రోడ్లపై పడుకుని ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎముకలు కొరికే చలిలో ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఇందులో 90-95 ఏళ్ల వయసు ఉన్న వృద్దులు, పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు.
ఈ శీతల వాతావరణం అనారోగ్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే కొందరు మరణించారు కూడా.. ఇది మనందరికీ ఆందోళన కలిగించే విషయం. నేను చాలా ఆశతో ఈ లేఖను రాస్తున్నాను. ఈ దేశానికి ప్రధానిగా మీ కుమారుడు నరేంద్ర మోదీ.. ఆయన ఆమోదించిన చట్టాలను ఆయనే రద్దు చేయగలరు. ఎవరి మాటనైనా తిరస్కరించవచ్చు కానీ.. తల్లి మాటను ఎవరూ కూడా తిరస్కరించరని నేను నమ్ముతున్నాను. ఒక తల్లి మాత్రమే కొడుకును ఆదశిస్తుంది. ఈ పని చేస్తే దేశం మొత్తం మీకు కృతజ్ఞతలు తెలుపుతుందని పేర్కొన్నారు.