Final Election Results : ఇది బీజేపీ దండయాత్ర.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ ఇవే..
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దండయాత్ర చేసింది. ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల సత్తా చాటింది.(Final Election Results)
Final Election Results : దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఫైనల్ రిజల్ట్ కూడా వచ్చేసింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దండయాత్ర చేసింది. ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల సత్తా చాటింది. దేశ రాజకీయాల్లో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అత్యధిక స్థానాల్లో అఖండ విజయంతో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టబోతోంది. ఉత్తరాఖండ్, మణిపూర్లలోనూ అధికారం నిలబెట్టుకుంది బీజేపీ. గోవాలో 20 స్థానాలతో అతి పెద్ద పార్టీగా నిలిచింది. పంజాబ్లో ఆప్ దుమ్మురేపింది. అధికార కాంగ్రెస్తో పాటు బీజేపీని ఊడ్చేసి భారీ విజయం సొంతం చేసుకుంది.(Final Election Results)
యూపీలో వరుసగా రెండోసారి..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి బీజేపీ విజయం సాధించింది. యూపీలో అధికారం నిలబెట్టుకున్న బీజేపీ కూటమి మూడింట రెండొంతుల సీట్లు సొంతం చేసుకుంది. యూపీలో మొత్తం 403 స్థానాలు ఉండగా.. సాధారణ మెజార్టీకి 202 స్థానాలు అవసరం. 273 సీట్లను తన ఖాతాలో వేసుకున్న కమలనాథులు అఖండ విజయం సాధించారు. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ కూటమి 125 స్థానాలను గెలుచుకుని బలం పుంజుకోగా.. బీఎస్పీ ఒకటి, కాంగ్రెస్ రెండు చోట్ల, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు.(Final Election Results)
ఉత్తరాఖండ్ లో సెంటిమెంట్ బ్రేక్…
ఉత్తరాఖండ్లో ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వం మార్చే సంప్రదాయాన్ని కాదని ఓటర్లు వరుసగా రెండోసారి అధికార బీజేపీకే పట్టంకట్టారు. కాంగ్రెస్తో హోరాహోరీ పోటీ ఉంటుందని ఎగ్జిట్పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ స్పష్టమైన మెజార్టీతో మరోసారి కమలదళానికే అధికార పీఠం అందించారు. దేవ్భూమిలో మొత్తం 70 నియోజకవర్గాలు ఉండగా.. సాధారణ మెజార్టీకి 36 స్థానాలు అవసరం. బీజేపీ 47 చోట్ల విజయం సాధించి స్పష్టమైన మెజార్టీతో అధికారం నిలబెట్టుకుంది. కాగా, ఖటియా నుంచి బరిలోకి దిగిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి ఓటమిపాలయ్యారు.(Final Election Results)
UP Congress : ప్చ్ ప్రియాంక..! కాంగ్రెస్ ఓటమికి కారణాలివే..!
గోవాలో మళ్లీ కమల వికాసం..
గోవాలోనూ మరోసారి అధికారం చేపట్టనుంది బీజేపీ. ప్రభుత్వ ఏర్పాటుకు అసవరమైన స్థానాలకు ఒకే ఒక్క సీటుదూరంలో నిలిచిపోయిన బీజేపీ.. స్వతంత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇక్కడ అధికార బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 20చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ 12 స్థానాలు గెలుచుకోగా.. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) రెండు, రివల్యూషనరీ గోన్స్ పార్టీ (ఆర్జీపీ) ఒకటి, స్వతంత్రులు మూడో చోట్ల విజయం సాధించారు. పంజాబ్లో ఘన విజయం సాధించిన ఆప్.. గోవాలో రెండు స్థానాలను గెలుచుకుంది.(Final Election Results)
మణిపూర్లోనూ బీజేపీ హవా..
మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ అందుకుంది. 32 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 60 ఎమ్మెల్యే సీట్లు ఉండగా.. అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 31 సీట్లు గెలవాల్సి ఉంటుంది. బీజేపీ 32 సీట్లు గెలుచుకొని స్పష్టమైన మెజార్టీని సాధించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ ఏడు చోట్ల విజయం సాధించగా.. జనతాదళ్ (యూ) ఆరు స్థానాల్లో, కాంగ్రెస్ 5, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు.
పంజాబ్లో ఆప్ క్లీన్స్వీప్..
పంజాబ్లో అధికారం చేతులు మారింది. కాంగ్రెస్ను ఓడించిన ఆప్ భారీ మెజార్టీతో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. 2017 ఎన్నికల్లో 20 స్థానాలను గెలిచిన ఆప్.. ఈసారి ఏకంగా 92 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. ఢిల్లీ మోడల్ మేనిఫెస్టోతో పంజాబ్ ఓటర్ల మనసు దోచిన ఆప్ జోరుకు కాంగ్రెస్, అకాలీదళ్ బడా నేతలు, మాజీ సీఎంలు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పంజాబ్ పీఠం ఆప్ కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్పోల్స్ అంచనాలు నిజమయ్యాయి.
Congress Loosing Power : మరింత దిగజారిన కాంగ్రెస్.. నాడు 13.. నేడు 2 రాష్ట్రాలకే పరిమితం
117 స్థానాలు కలిగిన పంజాబ్లో చీపురు పార్టీ 92 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత ఎన్నికల్లో 77స్థానాలతో అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్.. ఈసారి 18 సీట్లకే పరిమితమైపోయింది. 2017లో 15 సీట్లు గెలిచిన శిరోమణి అకాలీదళ్ ఈ ఎన్నికల్లో నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి రాగా.. బీజేపీ గతం కన్నా ఒక స్థానం తగ్గి ఈసారి రెండుచోట్ల గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థి ఒకచోట విజయం సాధించారు.