India Covid 19 : బాబోయ్.. భారత్లో ఒక్కరోజే 1.53లక్షల కొత్త కేసులు, 839 మరణాలు.. దేశంలో ఇదే తొలిసారి
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. వైరస్ ఉధృతి మరింతగా పెరిగింది. మరోసారి లక్షకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా రికార్డు స్థాయిలో లక్షా 50వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం, 800లకు పైగా మరణాలు చోటు చేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే కొవిడ్ కేసులతో పాటు మరణాలూ భారీగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 14.12లక్షల పరీక్షలు చేయగా..

Corona Cases Have Increased Massively In India1
India Covid 19 : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. వైరస్ ఉధృతి మరింతగా పెరిగింది. మరోసారి లక్షకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా రికార్డు స్థాయిలో లక్షా 50వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం, 800లకు పైగా మరణాలు చోటు చేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే కొవిడ్ కేసులతో పాటు మరణాలూ భారీగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 14.12లక్షల పరీక్షలు చేయగా.. ఒక లక్ష 52వేల 879 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దేశంలో కరోనా వెలుగు చూసిన తర్వాత కేసులు ఇంత భారీ సంఖ్యలో వెలుగు చూడటం ఇదే మొదటిసారి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,33,58,805కి చేరింది.
భారీగా పెరిగిన మరణాలు:
ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 794 నమోదు కాగా.. శనివారం(ఏప్రిల్ 10,2021) ఆ సంఖ్య మరింత పెరిగింది. మొత్తం 839మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,69,275కి చేరింది. ఇక మరణాల రేటు 1.28 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 11,08,087 కి పెరిగింది. కొత్తగా 90వేల 584మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,20,81,443కు చేరి.. రికవరీ రేటు 90.80శాతానికి తగ్గింది. ఈ మేరకు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం(ఏప్రిల్ 11,2021) ఉదయం బులెటిన్ విడుదల చేసింది.
మహారాష్ట్రలో డేంజర్ బెల్స్:
మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే దాదాపు 58వేల 993వేల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 301 మరణాలు నమోదయ్యాయి. 45వేల 391 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 32.88లక్షల మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరిలో 26.95లక్షల మంది కోలుకోగా.. 57,329 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 5.36లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
ఢిల్లీలోనూ కఠిన ఆంక్షలు:
దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 8వేల 521 కేసులు నమోదయ్యాయి. 39మంది కరోనాతో మరణించారు. ఢిల్లీలో కరోనా కట్టడికి ప్రభుత్వం శనివారం(ఏప్రిల్ 10,2021) పలు కఠిన ఆంక్షలు విధించింది. స్థానిక మెట్రో రైళ్లు, బస్సులు 50శాతం సీట్ల సామర్థ్యంలోనే నడుస్తాయి. వివాహ వేడుకల అతిథుల సంఖ్యను 50కి పరిమితం చేసింది. రెస్టారెంట్లు, బార్లు సైతం 50శాతం సామర్థ్యంతో పనిచేయాలని అధికారులు స్పష్టం చేశారు. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, సంస్కృతిక సంబంధ సమావేశాలను నిషేధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మహారాష్ట్ర నుంచి వచ్చే విమాన ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ నివేదిక తప్పనిసరి చూపాల్సి ఉంటుంది.
తెలంగాణలో 3వేలు దాటిన కరోనా కేసులు:
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తాజాగా 3వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. నిన్న(ఏప్రిల్ 10,2021) రాత్రి 8గంటల వరకు 1,15,311 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 3వేల 187 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు.
1800లకు చేరువలో మరణాలు:
రాష్ట్రంలో నిన్న కరోనాతో మరో ఏడుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,759కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 787 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,05,335కి చేరింది. ప్రస్తుతం 20,184 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 13,366 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 551 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం(ఏప్రిల్ 11,2021) ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
ఏపీని హడలెత్తిస్తున్న కరోనా:
సెకండ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. రోజురోజుకు కరోనా బారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ వందల సంఖ్యలోనే నమోదైన కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పుడు ఏకంగా వేలకు చేరుకుంది. క్రమంగా ఆ సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం(ఏప్రిల్ 9,2021) 2వేలకు పైగా కేసులు నమోదవగా.. శనివారం(ఏప్రిల్ 10,2021) ఏకంగా 3వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 31వేల 929 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా.. 3వేల 309 మందికి కోవిడ్ 19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ను విడుదల చేసింది.
కరోనాతో మరో 12 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,053 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18వేల 666 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 9,21,906కి చేరింది. ఇక 8,95,949 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 7వేల 291 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతున్న కొత్త కేసులు, మరణాలు ప్రజలను వణికిస్తున్నాయి.