PM Narendra Modi : అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ

మణిపూర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. చురాచాంద్‌పూర్ జిల్లా సింఘాట్ సబ్ డివిజన్ పరిధిలో 46 అసోం రైఫిల్స్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌, ఆయన కుటుంబమే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు.

PM Narendra Modi : అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ

Pm Narendra Modi Condemns Manipur Terrorist Attack

Updated On : November 13, 2021 / 6:41 PM IST

Manipur Terrorist Attack : మణిపూర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. చురాచాంద్‌పూర్ జిల్లా సింఘాట్ సబ్ డివిజన్ పరిధిలో 46 అసోం రైఫిల్స్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌, ఆయన కుటుంబమే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కమాండింగ్‌ ఆఫీసర్‌ విప్లవ్‌ త్రిపాఠి, అతని భార్య, కుమారుడితో పాటు ముగ్గురు సైనికులు మరణించారు. ఉదయం 10 గంటలకు ఈ ఉగ్రదాడి జరిగింది. దాడి జరిగిన సమయంలో క్విక్ రియాక్షన్ టీమ్‌ సహా అధికారి కుటుంబ సభ్యులు కాన్వాయ్‌లోనే ఉన్నారు. ఉగ్రదాడిలో కల్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడు మృతి చెందినట్టు తెలిసింది. మణిపూర్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఏ గ్రూపు దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.

అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడి ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. అమరులైన సైనికులకు, కుటుంబ సభ్యులకు ఆయన నివాళులర్పించారు. వారి త్యాగం ఎప్పుడూ మరువలేనదిగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై మిలిటెంట్ల దాడిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇదొక పిరికిపందల చర్యగా పేర్కొన్నారు.


దాడి బాధాకరమని రాజ్ నాథ్ విచారం వ్యక్తం చేశారు. దేశం ఐదు మంది వీరసైనికులను కోల్పోయిందన్నారు. వారి కుటుంబాలకు రాజ్ నాథ్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మరోవైపు.. మిలిటెంట్ల దాడి ఘటనను ఎన్. బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. మిలిటెంట్లను మట్టుబెట్టేందుకు రాష్ట్ర పోలీసులు, పారామిలటరీ సిబ్బంది అవిశ్రాంతంగా పని చేస్తున్నారని తెలిపారు. మిలిటెంట్ దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని అన్నారు.
Read Also : Adhanom Ghebreyesus : బూస్ట‌ర్ డోస్ పంపిణీ బూట‌కం.. పేద‌దేశాలకు సింగిల్ డోసు దక్కేనా!