PM Narendra Modi : పర్యావరణ పరిరక్షణలో భారత్ కొత్త అడుగులు.. సౌర, పవన విద్యుత్పై మోదీ కీలక వ్యాఖ్యలు
PM Narendra Modi : ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ, పర్యావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
PM Narendra Modi
PM Narendra Modi : ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ, పర్యావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ అంతర్జాతీయ సదస్సును శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.
వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు పునరుత్పాదక ఇంధనం, సౌరశక్తి, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో భారత్ చేపడుతున్న చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. గత 12 ఏళ్లలో భారత్ పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని మోదీ తెలిపారు. ప్రధానంగా సౌర విద్యుత్ సామర్థ్యం రెండు గిగావాట్ల నుంచి 160 గిగావాట్లకుపైగా పెరిగిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ విద్యుత్ అవసరాలను తీర్చడంలో పునరుత్పాదక ఇంధనం కీలక పాత్ర పోషిస్తోందని మోదీ చెప్పారు.
కుసుమ్ పథకం కింద సుమారు 30లక్షల మంది రైతుల పొలాల్లో సౌర విద్యుత్ పంపులను ఏర్పాటు చేసినట్లు ప్రధాని తెలిపారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో ఎల్ఈడీ బల్బుల వినియోగం పెరగడం వల్ల విద్యుత్ ఆదాతో పాటు ఉద్గారాల తగ్గింపునకు కూడా సహకారం అందిందన్నారు. భారతదేశంలోని ప్రాచీన పర్యావరణ ఆలోచనలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానిస్తూ ముందుకు సాగుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పవన విద్యుత్ సామర్థ్యం మూడు రెట్లు పెరిగిందని, జల విద్యుత్ సామర్థ్యం కూడా గణనీయంగా విస్తరించిందని పేర్కొన్నారు.
వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు భారత్ అంతర్జాతీయ స్థాయిలో పలు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని మోదీ తెలిపారు. పారిస్ వాతావరణ ఒప్పందంలో భారత్ చేసిన కట్టుబాట్లను నిర్ణీత గడువుకు ముందుగానే సాధించిందని అన్నారు. జీ20 దేశాల్లో ఈ లక్ష్యాలను ముందుగానే పూర్తి చేసిన దేశంగా భారత్ నిలిచిందని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పాలన వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. 17 దేశాలకు చెందిన న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులతో పాటు భారత్కు చెందిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, పర్యావరణ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు.
