ఎన్నికల కమిషనర్ల గురించి పార్లమెంట్‌లో 3 ప్రశ్నలు అడిగి దడదడలాడించిన రాహుల్ గాంధీ

ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్యానెల్‌లో మార్పులు ఎందుకు చేశారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

ఎన్నికల కమిషనర్ల గురించి పార్లమెంట్‌లో 3 ప్రశ్నలు అడిగి దడదడలాడించిన రాహుల్ గాంధీ

Updated On : December 9, 2025 / 6:13 PM IST

Rahul Gandhi: భారత ఎన్నికల సంఘం చీఫ్‌తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడానికి ప్రధాని మోదీ ప్రభుత్వం ఎందుకు పట్టుబట్టిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

ఎన్నికల సంస్కరణలపై లోకసభలో రాహుల్ గాంధీ మంగళవారం మాట్లాడుతూ కేంద్రం సర్కారుపై విమర్శలు గుప్పించారు. “ఈ ప్యానెల్ నుంచి సీజేఐను ఎందుకు తొలగించారు? మనకు సీజేఐపై నమ్మకం లేదా?” అని రాహుల్ గాంధీ అడిగారు.

Also Read: గ్లోబల్ సమ్మిట్‌: పెట్టుబడులకు ఈ బడా కంపెనీల ఒప్పందాలు.. ఎన్నెన్ని కోట్లాది రూపాయలు పెట్టాయంటే?

తాను ప్రతిపక్ష నాయకుడిగా ఈ ప్యానెల్‌లో ఉన్నానని రాహుల్ గాంధీ అన్నారు. కానీ, తాను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని చెప్పారు. ఆ ప్యానెల్‌లో ఒకవైపు ప్రధాని మోదీ, మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉండటంతో తాను గళం విప్పే పరిస్థితి లేదని పేర్కొన్నారు. 2023 చట్టం ప్రకారం ఇందులో ముగ్గురు సభ్యుల ఎంపిక ప్యానెల్ ఉంటుంది.

ప్రధాని ప్యానెల్ అధ్యక్షుడిగా ఉంటారు. అలాగే ఈ ప్యానెల్‌లో లోకసభ ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర క్యాబినెట్ మంత్రి ఉన్నారు. సీజేఐ స్థానంలో ఈ ప్యానెల్‌లో కేంద్ర క్యాబినెట్ మంత్రిని తీసుకొచ్చారు. ఈ ముగ్గురు సభ్యుల ప్యానెల్ రాష్ట్రపతికి సిఫార్సులు చేస్తుంది.

ఈ ప్యానెల్‌ గురించే రాహుల్‌ గాంధీ ఇవాళ ప్రశ్నించారు. అలాగే, అధికారిక బాధ్యతల్లో ఉన్న సమయంలో ఎన్నికల కమిషనర్లు తీసుకున్న చర్యలకు.. వారికి ఎన్నటికీ శిక్ష పడకుండా ఉండేలా చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ అడిగిన 3 ప్రశ్నలు క్లుప్తంగా..

1. ఈ ప్యానెల్ నుంచి సీజేఐను ఎందుకు తొలగించారు?
2. మనకు సీజేఐపై నమ్మకం లేదా?
3. అధికారిక బాధ్యతల్లో ఉన్న సమయంలో ఎన్నికల కమిషనర్లు తీసుకున్న చర్యలకు.. వారికి ఎన్నటికీ శిక్ష పడకుండా ఉండేలా చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు?