Telangana : గాంధీ భవన్లో సోనియా గాంధీ బర్త్ డే వేడుకల్లో ఆసక్తికర దృశ్యాలు
తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. భారీ కేకును ఏర్పాటు చేశారు. సోనియా పుట్టిన రోజు వేడులకు కాంగ్రెస్ నేతలంతా తరలి వచ్చారు.
Sonia Gandhi birthday celebrations at Gandhi Bhavan : ఈ వేడుకల్లో ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుతో కేకు కట్ చేయించారు. రేవంత్ పక్కనే ఉన్న భట్టిని పక్కకు జరిపి వీహెచ్ ను చేయి పట్టి ముందుకు తీసుకొచ్చి మరీ కేకు ఆయనతో స్వయంగా కట్ చేయించారు. చిన్నపిల్లాడి చేయి పట్టుకుని కట్ చేయించినట్లుగా రేవంత్ వీహెచ్ చేయి పట్టుకుని కేకు కట్ చేయించారు.ఆ తరువాత ఇద్దరు ఒకరికొకరు తినిపించుకున్నారు.
తరువాత వీహెచ్ ఓ కేకు ముక్క తీసుకుని భట్టి నోటిలో పెట్టి తినిపించేందుకు యత్నించగా ఆయన వారించారు. అయినా వీహెచ్ వినకుండా బలవంతంగా భట్టి నోట్లో కేకు ముక్క దాదాపు కుక్కేసినట్లుగా చేశారు. అలాగే అక్కడున్న అందరికి వీహెచ్ కేకు ముక్కలు పంచారు. ఇన్నాళ్టికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆనందం సీనియర్ నేత వీహెచ్ ముఖంలో స్పష్టంగా కనిపించింది.ఈ విజయంలో కీలక పాత్ర వహించిన రేవంత్ రెడ్డిని ఆయన ఆలింగనం చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒకరి చెవిలో మరొకరు గుసగుసలాడుకుంటు నవ్వుకున్నారు.
Also Read : తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరెవరికి ఏశాఖ దక్కిందంటే?
మరోపక్క మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాణిక్యం ఠాక్రే నోట్లో కేకు ముక్క పెట్టబోతే ఆయన కూడా వారించారు.అయినా వెంకట రెడ్డి ఊరుకోలేదు. బలవంతంగా ఆయన నోట్లో కేకు ముక్క పెట్టారు. ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు తెలంగాణలో తొలిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన శుభ తరుణంలో సోనియాగాంధీ 74వ జన్మదినోత్సవ వేడుకల్లో చోటుచేసుకున్నాయి.