Byreddy Rajasekhar Reddy : రాయలసీమ పట్ల జగన్కు చిత్తశుద్ధి లేదు, ఈసారి ఉధృతంగా ఉద్యమం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
Byreddy Rajasekhar Reddy : రాయలసీమ ప్రజల్లో చైతన్యం తేవడానికి 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సంతక సేకరణ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. సంతకాల సేకరణ అనంతరం ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తాం.

Byreddy Rajasekhar Reddy(Photo : Twitter)
Byreddy Rajasekhar Reddy : రాయలసీమ అభివృద్ధి పట్ల సీఎం జగన్ కు చిత్తశుద్ధి లేదన్నారు రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. రాయలసీమ 8 జిల్లాలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. రాయలసీమ యువత ఉన్నత చదువులు చదివి ఇతర రాష్ట్రాల్లో కూలి పని చేస్తున్నారని వాపోయారు.
రాయలసీమ కర్తవ్య దీక్షను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బైరెడ్డి. అప్పర్ భద్ర, తీగల వంతెన.. ఈ రెండూ రాయలసీమకు ఉరితాడు లాంటివన్నారు. గుండ్రేవుల ప్రాజెక్ట్ రాయలసీమకు ఎంతో ముఖ్యమైనదని, కానీ దీని గురించి ఎవరూ మాట్లాడరని అన్నారు. 70 నుంచి 80 టీఎంసీల రిజర్వాయర్ మాకు కావాలని ఆయన డిమాండ్ చేశారు. చిల్లర ప్రాజెక్టులు చూపించి రాయలసీమకు ఏదో చేస్తున్నట్లు చెబుతున్నారని మండిపడ్డారు.
” రాయలసీమ ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చారా? రాయలసీమ కోసం జగన్ మైండ్ పని చేయడం లేదు. రాయలసీమ పట్ల జగన్కు చిత్తుశుద్ధి లేదు. ఎవరో ఏమో అనుకుంటారనే భ్రమలోనే నాలుగేళ్ల పాలన అయిపోయింది. రాజధాని ఇక్కడ లేదు. అన్నీ అక్కడే ఉన్నాయి. ఇక్కడ చేసే నాధుడే లేడు. రాయలసీమను అంటరాని వారిగా మార్చారు ఇక్కడి నాయకులు.
రాయలసీమ ప్రజల్లో చైతన్యం తేవడానికి 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సంతక సేకరణ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. సంతకాల సేకరణ అనంతరం ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తాం. రెండో దశ ఉద్యమంలో భాగంగా ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తాం. రాయలసీమలో నాయకులు సంతోషంగా ఉన్నారు తప్ప సామాన్య ప్రజలు సంతోషంగా లేరు” అని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.