దిశ కేసు : విచారణ జరిగేది ఎక్కడ

  • Published By: madhu ,Published On : December 5, 2019 / 01:07 AM IST
దిశ కేసు : విచారణ జరిగేది ఎక్కడ

Updated On : December 5, 2019 / 1:07 AM IST

దిశ హత్యకేసులో కీలక ముందడగు పడింది. అత్యాచారం ఆపై హత్య ఎలా జరిగిందో సాక్ష్యాధారాలతో సహా నిరూపించేందుకు.. నిందితులను పోలీసుల కస్టడీకి అనుమతించింది షాద్‌నగర్‌ కోర్టు. మూడు రోజుల పాటు కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఎట్టకేలకు వారం రోజుల కస్టడీకి అనుమతించింది. కోర్టు అనుమతించడంతో… దిశపై దారుణ హత్యాచారానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను.. 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం ఉదయం పోలీసులు కస్టడీకీ తీసుకోనున్నారు. అయితే.. నిందితులను చర్లపల్లి జైలులోనే ఉంచి విచారిస్తారా… లేక మరే ప్రాంతానికైనా వీరిని తీసుకెళ్లి ప్రశ్నిస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. నలుగురు నిందితులపై జనం తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉండడం, షాద్‌నగర్‌ స్టేషన్‌ను కూడా ముట్టడించడంతో.. చర్లపల్లి నుంచి వారిని బయటకు తీసుకురావడం సేఫ్ కాదనుకుంటున్నారు పోలీసులు. 

దిశ కేసులో ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సమగ్ర వివరాలు సేకరించే పనిలో ఉన్నాయి. దిశ హంతకులను కస్టడీకి తీసుకోనున్న పోలీసులు ప్రధానంగా ఆధారాల సేకరణపై దృష్టి పెట్టనున్నారు. దిశ మొబైల్‌ ఫోన్‌ను కూడా ఇంకా దొరకలేదు. బాధితురాలి సెల్ ఫోన్ ఇప్పటికీ మిస్సింగ్‌లో ఉంది. దాన్ని ఏం చేశారు.. ఎక్కడ పడేశారు.. ఘటన తర్వాత లారీని మళ్లీ తొండుపల్లి గేటు వద్దే ఎందుకు పార్క్ చేశారు.. లాంటి అంశాల అంశాల మిస్టరీని పోలీసులు చేధించనున్నారు. అంతేకాకుండా… బాధితురాలిని హత్య చేసిన తర్వాత పెట్రోలు పోసి దహనం చేశారా.. లేదా సజీవదహనం చేశారా.. అనే విషయంలోనూ అనుమానులున్నాయి.

పోలీసుల విచారణలో ఈ అంశాల గుట్టు విప్పనున్నారు. దీంతో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తద్వారా శంషాబాద్ టోల్ గేట్ దగ్గర నుంచి చటాన్‌పల్లి వరకు జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకోనున్నారు. సంఘటన జరిగిన తీరును వివరంగా ఛార్జ్‌షీట్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. కస్టడీలో నిందితుల నుంచి నిజాలను కక్కించంతోపాటు వాటికి సాంకేతికపరమైన ఆధారాలు చూపిస్తూ ఈ ఛార్జ్‌షీట్‌ను పోలీసులు రూపొందించనున్నారు. దీన్ని ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో సమర్పించి.. విచారణను వేగంగా పూర్తి చేయించి.. కఠిన శిక్షలు వేయించాలని భావిస్తున్నారు. 

> ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. 
> ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి దిశ హంతకులను కఠినంగా శిక్షించాలంటూ తెలంగాణ న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌ రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. 
> కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. 
> ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసుకోవచ్చంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 
> ఈ కేసులో సత్వర విచారణ చేపట్టి నిందితులకు సాధ్యమైనంత త్వరగా శిక్ష విధించే అవకాశం ఉంది.
Read More : దిశ ఘటన తర్వాత హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం