Tdp Vs Ysrcp: అసెంబ్లీకి ముందే ఏపీలో హైవోల్టేజ్‌ పొలిటికల్ హీట్.. అధికార పార్టీ వాదనేంటి? వైసీపీ రిప్లయ్ ఏంటి?

టీడీపీ విసిరిన సవాల్ ఏంటి? వైసీపీ లేవనెత్తిన డిమాండ్ ఏంటి? సభ కంటే ముందే మరింత ఆసక్తికరంగా మారిన ఏపీ రాజకీయం..

Tdp Vs Ysrcp: అసెంబ్లీకి ముందే ఏపీలో హైవోల్టేజ్‌ పొలిటికల్ హీట్.. అధికార పార్టీ వాదనేంటి? వైసీపీ రిప్లయ్ ఏంటి?

Updated On : September 15, 2025 / 9:35 PM IST

Tdp Vs Ysrcp: అసెంబ్లీ సెషన్ ఇంకా స్టార్టే కాలేదు. ఇంకో రెండ్రోజుల టైమ్ ఉంది. అంతకంటే ముందే అధికార, విపక్షాల మధ్య నెక్స్ట్‌ లెవల్‌ డైలాగ్‌ వార్ నడుస్తోంది. మధ్యలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కామెంట్స్‌ ఇంకా పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నాయి. దీంతో అసెంబ్లీలో కనిపించాల్సిన సభా సమరం కాస్త..డైలాగ్‌ వార్‌తో ట్రైలర్‌ను తలపిస్తోంది. సభ కంటే ముందే ఏపీ రాజకీయం తెగ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది.

దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ఇప్పటికే చంద్రబాబు సవాల్ చేశారు. నో వర్క్..నో పే అంటూ స్పీకర్ బాంబ్ పేల్చారు. జగన్‌ కోసం రూల్స్ మార్చలేమని డిప్యూటీ స్పీకర్ అంటున్నారు. వైసీపీ మాత్రం సింగిల్‌ లైన్‌ డిమాండ్ మీదే ఉంది. అధికార పార్టీ వాదనేంటి? వైసీపీ రిప్లై ఏంటి?

ఏపీలో కూటమి పవర్‌లోకి వచ్చి 15 నెలలు అయిపోయింది. ఇప్పటివరకు మూడు, నాలుగు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. పవర్‌ కోల్పోయిన మొదట్లో అసెంబ్లీకి వచ్చి శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు..తిరిగి అసెంబ్లీ వైపు చూడటం లేదు. ప్రతీసారి అసెంబ్లీ సెషన్ అప్పుడు కూటమి నేతలు సవాల్‌ విసరడం..దానికి వైసీపీ ఓ మెలిక పెట్టడం కామన్‌ అయిపోయింది. ఇప్పుడు కూడా అదే డిమాండ్‌ను తెరమీదకు తెచ్చింది వైసీపీ.

అయితే ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కామెంట్స్‌ కూడా వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సీఎం చంద్రబాబు సవాల్ విసిరి పొలిటికల్‌ హీట్‌ను పెంచితే..స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ రూల్స్‌, లాజిక్స్‌తో వైసీపీని ఇరకాటంలో పెట్టే స్కెచ్ వేస్తున్నారు.

ప్రజా తీర్పుని గౌరవించకపోతే ఎలా..?

ప్రజలు మీకు ఓటేసిందే వారి సమస్యలను ప్రస్తావించాలని. అసెంబ్లీకి వస్తేనే ప్రజా సమస్యలపై చర్చించొచ్చు అంటున్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. ప్రజా తీర్పుని గౌరవించకపోతే ఎలా..సభకు రాకుండా ఉంటే ఎలా కుదురుతుందంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ జరిగేదే ఏడాదికి కేవలం 45 రోజులు..ఆ సమయంలో కూడా సభకు అటెండ్ కాకపోతే ఎలా అని క్వశ్చన్ చేస్తున్నారు.

సభకు హాజరు కాని ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటారని నిలదీస్తున్న స్పీకర్..నో వర్క్ నో పే రూల్‌ను ప్రస్తావించడం హాట్ టాపిక్ అవుతోంది. ఒక చిన్న ఉద్యోగి విధులకు హాజరు కాకపోతే నో వర్క్ నో పేని అమలు చేస్తున్నప్పుడు..అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం కరెక్టేనా అని లాజిక్ పాయింట్‌ను రేజ్‌ చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

జగన్‌కు ప్రతిపక్ష హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు..

స్పీకర్‌కు చెప్పకుండా అసెంబ్లీ వర్కింగ్ డేస్ 60 రోజుల్లో ఒక్కసారి సభకు గైర్హాజరు అయినా..ఆటోమెటిక్‌గా సభ్యత్వం రద్దవుతుందని నిబంధనల్లో ఉందని కూటమి నేతలు చెబుతున్న మాట. గత సెషన్‌కు ముందే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సంచలనం కామెంట్స్ చేసి చర్చకు దారి తీశారు. జగన్‌ సభకు రాకపోతే పులివెందులకే ఉప ఎన్నిక వస్తుందని కూడా హెచ్చరించారు. అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామంటున్న వైసీపీ అధినేతను ఉద్దేశించి డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు లేటెస్ట్‌గా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవడం లేదని..ఆయన కోసం కొత్తగా విధివిధానాలు రూపొందించలేమన్నారు రఘురామ.

అటు కూటమి..ఇటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కామెంట్స్‌కు అదే రేంజ్‌లో కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది వైసీపీ. గతంలో చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదన్న విషయం మర్చిపోవద్దంటోంది ఫ్యాన్ పార్టీ. గతంలో ఎన్టీఆర్ కూడా సభకు అటెండ్ కాలేదని గుర్తు చేస్తున్నారు. మన స్టేట్‌లోనే కాదు..పక్క రాష్ట్రాల ఎగ్జాంపుల్స్‌ కూడా ప్రస్తావిస్తున్నారు వైసీపీ నేతలు. తమిళనాడులో జయలలిత మొదట అసెంబ్లీకి రానంటూ..సీఎంగానే అడుగు పెడతాను అని ఒక శపథం చేసి సభకు రాలేదని గుర్తు చేస్తున్నారు.

ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ కూడా సభకు రాలేదన్న విషయం మర్చిపోవద్దంటున్నారు. 2017లో జగన్, 2022లో చంద్రబాబు కూడా సభకు రాలేదని పాత చిట్టా చదువుతోంది వైసీపీ. కానీ ఇప్పుడు జగన్‌తో పాటు పదకొండు మంది ఎమ్మెల్యేలు..తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ సభకు డుమ్మా కొట్టడమే సమస్యగా మారిందంటోంది కూటమి. పైగా గతంలో సవాల్ చేసి సభకు దూరంగా ఉన్న నేతలంతా ఎన్నికలకు ముందు రాజకీయ ఎత్తుల్లో భాగంగా సభకు డుమ్మా కొట్టారన్న చర్చ ఉంది.

జగన్ మాత్రం పవర్‌ పోయినప్పటి నుంచి అసెంబ్లీ వైపే చూడకపోవడం ఎంత వరకు కరెక్టో ప్రజలో ఆలోచించాలంటోంది కూటమి. సభకే రాకుండా తక్కువ టైమ్‌ ఇస్తారని ఊహించుకోవడమేంటని ప్రశ్నిస్తోంది కూటమి. మరోవైపు అసెంబ్లీకి వెళ్లకుండానే ప్రెస్‌మీట్లు, మీడియా సమావేశాల ద్వారా కూటమి సర్కార్ విధానాలపై ప్రశ్నిస్తాం..పోరాడతామని అంటోంది వైసీపీ. సభ స్టార్ట్‌ అయ్యాక సభలో కూటమి..మీడియా ముఖంగా వైసీపీ యాక్షన్..రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: యూరియాతో క్యాన్సర్..! సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. రైతులకు అవగాహన కల్పించాలని సూచన..