మీకు పెళ్లిళ్లంటే మక్కువ…జగన్ కు ప్రజాసేవ మక్కువ

ఏపీ సీఎం జగన్ చేస్తున్నమంచి పనులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కనిపించటం లేదని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. కేవలం చంద్రబాబు చెప్పిందే పవన్ కళ్యాణ్ కు వినిపిస్తోందని మండి పడ్డారు. జగన్ అధికారంలోకి రాగానే లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఇచ్చిన రైతు భరోసా వంటి బృహత్కర పథకాలు పవన్ నాయుడుకి కనబడటం లేదని ఎద్దేవా చేశారు. పవన్ నాయుడుకి పెళ్లిళ్ల మీద మక్కువ కాబట్టి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. సీఎం జగన్ కు ప్రజా సేవ మీద మక్కువ కాబట్టి సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
సీఎం వైఎస్ జగన్ చేసిన ఎన్నో మంచి పనులపై ఎన్నడైనా ట్వీట్ చేశావా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం పవన్ నాయుడుకి చంద్రబాబు చెప్పిన ఇసుక తప్ప మరేమి కనిపించడం లేదని విమర్శించారు. గోదావరి నదిలో జూన్ 25 నుంచి వరద ప్రవహిస్తోందని, కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజి వద్ద నేటికి గేట్లు తెరిచే ఉన్నాయనే విషయం తెలుసా అంటూ ప్రశ్నించారు. ఇసుక కొరతకు వరదలే కారణమనే విషయం పవన్ కళ్యాణ్ కు తెలియక పోవటం బాధాకరం అని నాని అన్నారు. జగన్ పై కేసులు ఎందుకు పెట్టారో తనపక్కనే ఉన్న జేడీ లక్ష్మినారాయణను అడగమని చెప్పారు. పవన్ కళ్యాణ్ కు కులభావన నరనరాన జీర్ణించుకు పోయిందని నాని మండిపడ్డారు .
‘భవన కార్మికుల డబ్బులు మింగేసిన అచ్చెన్నాయుడుని పక్కన పెట్టుకుని పవన్ విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రశ్నిస్తా…. ప్రశ్నిస్తా అనే పవన్ నాయుడు.. చంద్రబాబు హయాంలో భవన కార్మికులకు జరిగిన ద్రోహంపై ఎప్పుడైనా ప్రశ్నించారా?. అన్నారు. పవన్ కు తల్లిదండ్రులు రోజూ సంస్కారం నేర్పుతారా?. ఎందుకంటే విశాఖ సభలో సీఎంపై ఇష్టాను సారంగా మాట్లాడారు. కానీ నేడు నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పారని అందుకే ఎవరినీ దూషించని అనడం విడ్డూరంగా ఉంది. అంటే విశాఖ సభ రోజు మీ అమ్మా నాన్నా సంస్కారం నేర్పలేదా?. మా సీఎం జగన్ కి తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు కాబట్టే ఏనాడు మిమ్మల్ని విమర్శించలేదని మంత్రి చెప్పారు వెంకయ్యనాయుడిని మీరు గతంలో అత్యంత దారుణంగా తిట్టింది నిజమా కాదా?’అని పవన్ కళ్యాణ్ ను మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.