IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ మూడో వన్డే.. పిచ్ రిపోర్టు, స్టేడియం రికార్డ్స్, ఇంకా..
భారత్, ఇంగ్లాండ్ జట్లు బుధవారం గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డే మ్యాచ్లో తలపడనున్నాయి.

Ahmedabad Pitch Report For IND vs ENG 3rd ODI
ఇంగ్లాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఇప్పటికే భారత జట్టు కైవసం చేసుకుంది. ఇక నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్ బుధవారం గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్, ఇంగ్లాండ్ జట్లు ఆడనున్న చివరి వన్డే మ్యాచ్ ఇదే. దీంతో ఈ మ్యాచ్లో విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీకి ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
ఇక ఇప్పటికే భారత జట్టు వన్డే సిరీస్ను గెలవడంతో ఆఖరి వన్డే మ్యాచ్లో తుది జట్టులో పలు మార్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రిజర్వ్ బెంచీను పరీక్షించాలని భావిస్తోంది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఆడని వికెట్ కీపర్ రిషబ్ పంత్, పేసర్ అర్ష్దీప్ సింగ్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్లకు తుది జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది.
తొలి రెండు వన్డేల్లో అదరగొట్టిన అక్షర్ పటేల్, జడేజాలకు విశ్రాంతి ఇచ్చి వారిస్థానంలో కుల్దీప్ యాదవ్, సుందర్ను జట్టులోకి తీసుకోవచ్చు. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలం అయిన కేఎల్ రాహుల్కు మరో అవకాశం ఇస్తారా? లేదంటే పంత్ను ఆడిస్తారా ? అన్న దానిపై సందిగ్థత ఉంది. ఒకవేళ ఇద్దరిని ఆడించాలి అనుకుంటే మాత్రం అప్పుడు గిల్కు విశ్రాంతి ఇవ్వొచ్చు. యశస్వి జైస్వాల్ బెంచీకే పరిమితం కావొచ్చు. షమీ స్థానంలో అర్ష్దీప్ సింగ్ ఆడొచ్చు. గత మ్యాచ్తో ఫామ్లోకి వచ్చిన రోహిత్ శర్మ.. తన ఫామ్ను కంటిన్యూ చేయాలని భావిస్తుండగా ఈ మ్యాచ్తోనైనా ఫామ్లోకి రావాలని కోహ్లీ భావిస్తున్నాడు.
భారత్ చివరి సారిగా ఇక్కడ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది.
ఇప్పటి వరకు ఎన్ని వన్డే మ్యాచ్లు జరిగాయంటే?
ఇప్పటి వరకు నరేంద్ర మోదీ స్టేడియంలో 36 వన్డే మ్యాచ్లు జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 19 సార్లు, లక్ష్యాన్ని ఛేదించిన జట్లు 19 సార్లు గెలుపొందాయి. ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 237 పరుగులు కాగా.. రెండో ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 208 పరుగులుగా ఉంది.
ఈ స్టేడియంలో భారత్ మొత్తం 20 వన్డేలు ఆడింది. ఇందులో 11 మ్యాచ్ల్లో గెలిచింది. 9 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక్కడి పిచ్ నెమ్మదిగా ఉంటుంది. స్పిన్నర్లకు ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది.
ఇంగ్లాండ్తో మూడో వన్డే భారత్ తుది జట్టు (అంచనా)..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.