ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మ్యాచ్.. ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో తెలుసా?
ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో రెండు సార్లు 270+ స్కోర్ చేసిన తొలి జట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్ రికార్డు క్రియేట్ చేసింది.
RCB vs SRH IPL 2024 Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా చిన్నస్వామి వేదికగా సోమవారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రన్-ఫెస్ట్గా మారింది. రెండు టీములు 250 పరుగులకు పైగా స్కోర్ చేయడంతో సరికొత్త హిస్టరీ క్రియేటయింది. ముందుగా సన్రైజర్స్ హైదరాబాద్ పరుగుల సునామీ సృష్టించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా దీటుగానే పరుగుల వరద పారించింది. IPL చరిత్రలో అత్యధిక జట్టు స్కోరు చేసిన జట్టుగా ఇప్పటికే రికార్డు లిఖించిన సన్రైజర్స్ హైదరాబాద్.. తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. క్రికెట్ ప్రియులకు మరిచిపోలేని అనుభూతిని అందించిన ఈ మ్యాచ్.. పలు రికార్డులను కూడా బ్రేక్ చేసింది.
1. సన్రైజర్స్ హైదరాబాద్ IPL చరిత్రలో అత్యధిక స్కోరు(287/3)ను నమోదు చేసింది. ఈ ఐపీఎల్లోనే ముంబై ఇండియన్స్పై చేసిన అత్యధిక స్కోరు(277/3)ను అధిగమించింది.
2. ఈ మ్యాచ్లో RCB, SRH కలిసి మొత్తం 549 పరుగులు చేశాయి. ఇది T20 క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే. ఇంతకుముందు సన్రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్లో 523 పరుగులు నమోదయ్యాయి.
3. ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు(22) బాదిన జట్టుగా SRH నిలిచింది. ఆర్సీబీ పేరిట ఉన్న ఈ రికార్డును బ్రేక్ చేసింది. 2013లో పూణె వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 21 సిక్సర్లు బాదింది.
4. ఈ మ్యాచ్లో SRH, RCB బ్యాటర్లు మొత్తం 38 సిక్సర్లు కొట్టి గత రికార్డును సమం చేశారు. ఇంతకుముందు జరిగిన హైదరాబాద్, ముంబై మ్యాచ్లోనూ సరిగ్గా 38 సిక్సర్లే నమోదయ్యాయి.
5. SRH, RCB బ్యాటర్లు ఈ మ్యాచ్లో మొత్తం 81 బౌండరీలు(43 ఫోర్లు, 38 సిక్సర్ల) కొట్టారు. 2023లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్లోనూ 81 బౌండరీలు నమోదయ్యాయి.
6. టీ20 ఛేజింగ్లో అత్యధిక పరుగులు చేసి ఓడిపోయిన జట్టుగా RCB రికార్డుకెక్కింది. 2023లో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్(258/5) చేసిన పరుగులే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉన్నాయి. తాజాగా ఈ రికార్డు RCB తన పేరిట లిఖించుకుంది. తాజా ఐపీఎల్లో SRHతో ఓడిపోయిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఛేజింగ్లో 246 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
7. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో రెండు సార్లు 270+ స్కోర్ చేసిన తొలి జట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్ రికార్డు క్రియేట్ చేసింది.
Also Read: వరుస ఓటములతో సతమతమవుతున్న ఆర్సీబీకి బిగ్ షాక్..
8. ఐపీఎల్లో రెండు సార్లు 250+ స్కోర్ చేసిన రెండో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. 2013లో పూణె వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 263/5 స్కోరు చేసింది.
9. ఒకే జట్టుకు చెందిన నలుగురు బౌలర్లు తమ ఓవర్లలో 50కి పైగా పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. RCBకి చెందిన రీస్ టాప్లీ (68), యష్ దయాల్ (51), లాకీ ఫెర్గూసన్ (52), విజయ్కుమార్ వైషాక్ (64) భారీగా పరుగులు ఇచ్చారు.
Also Read: ఇప్పటి వరకు చేసింది చాలు.. ఇక ఆపండి : హార్దిక్ పాండ్యకు కీరన్ పొలార్డ్ మద్దతు
10. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి 50+ భాగస్వామ్యాలు 7 నమోదు చేశాయి. ఇంతకు ముందు టీ20 మ్యాచ్ల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు.