ICC Womens World Cup: కీలక మ్యాచ్ లో ఘన విజయం.. సెమీస్ కు భారత్..
భారత బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Courtesy @ICC
ICC Womens World Cup: ఉమెన్స్ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో భారత్ గెలిచింది. డీఎల్ఎస్ ప్రకారం 53 పరుగుల తేడాతో భారత్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత వర్షం కురవడంతో టార్గెట్ ను కుదించారు. 44 ఓవర్లలో 325 పరుగులు నిర్దేశించారు. భారత బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ గెలుపుతో భారత్ సెమీస్ చేరింది.
అమ్మాయిలు ఆల్ రౌండ్ షోతో అదరగొట్టారు. తొలుత బ్యాటర్లు చెలరేగారు. సెంచరీలతో కదం తొక్కారు. తర్వాత బౌలర్లు విజృంభించారు. భారత ఓపెనర్లు ప్రతీకా రావల్, స్మృతి మంధాన శతకాలు బాదారు. ప్రతీకా 134 బంతుల్లో 122 పరుగులు చేసింది. స్మృతి మంధాన 95 బంతుల్లో 109 రన్స్ చేసింది. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో మెరిసింది. జెమీమా 55 బంతుల్లో 76 పరుగులు చేసింది.
భారీ స్కోర్ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ను.. భారత బౌలర్లు కట్టడి చేశారు. 154 పరుగులకే 5 వికెట్లు తీసి దెబ్బకొట్టారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్, క్రాంతి తలో రెండు వికెట్లు పడగొట్టారు. స్నేహ్ రానా, చరణి, దీప్తి శర్మ, ప్రతీకా రావల్ చెరో వికెట్ తీశారు.
Also Read: విమర్శకుల నోరు మూయించిన హర్షిత్ రాణా.. గంభీర్ నమ్మకాన్ని నిలబెడుతూ..