IPL 2025: పంజాబ్కు బిగ్ షాకిచ్చిన ఢిల్లీ.. అనూహ్యంగా టాప్-2 రేసులోకి ముంబై..! ఎలా అంటే?
పంజాబ్పై ఢిల్లీ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉన్న ముంబై జట్టుకు టాప్-2 కు వెళ్లే అవకాశం లభించింది.

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు వెళ్లిన పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్-2లో స్థానాన్ని పదిలం చేసుకోవాలని భావించింది. కానీ, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంజాబ్కు బిగ్ షాకిచ్చింది. దీంతో టాప్-2 సమీకరణాలు మారిపోయాయి. అనూహ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు టాప్-2 రేసులోకి దూసుకెళ్లేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి.
ఐపీఎల్ -18 నుంచి వెళ్తూవెళ్తూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ ను దెబ్బకొట్టింది. పట్టికలో అగ్రస్థానంపై కన్నేసిన పంజాబ్ ను శనివారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో పట్టికలో టాప్-2లో స్థానాన్ని పదిలం చేసుకోవాలని భావించిన పంజాబ్ జట్టుకు ఢిల్లీ జట్టు బిగ్ షాకిచ్చినట్లయింది.
పంజాబ్పై ఢిల్లీ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉన్న ముంబై జట్టుకు టాప్-2కు వెళ్లే అవకాశం లభించింది. అయితే, ముంబై జట్టు టాప్-2లోకి వెళ్లాలంటే తన చివరి మ్యాచ్లో విజయం సాధించడంతోపాటు.. మిగిలిన రెండు జట్ల గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది. తాజా సమీకరణాల ప్రకారం.. పట్టికలో టాప్- 2లోకి ముంబై ఇండియన్స్ ఎలా వస్తుందో చూద్దాం..
సమీకరణాలు ఇలా..
♦ ఐపీఎల్ -2025 సీజన్లో ప్లేఆప్స్లోకి గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్ జట్లు వచ్చాయి.
♦ ప్రస్తుతం పట్టికలో గుజరాత్ (18), పంజాబ్ (17), బెంగళూరు(17), ముంబై (16) పాయింట్లతో ఉన్నాయి.
♦ ఢిల్లీ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతుంది. అయితే, ఆ జట్టుకు ముంబై ఇండియన్స్ నుంచి ప్రమాదం పొంచి ఉంది.
♦ నాలుగు జట్లు 13 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. ఇంకా ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది.
♦ ముంబై ఇండియన్స్ సోమవారం పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది.
Also Read: RCB vs SRH : సన్రైజర్స్ కెప్టెన్ కమిన్స్ కంటే ఆర్సీబీ లీడర్ రజత్ పాటిదార్కు భారీ జరిమానా.. ఎందుకో తెలుసా?
♦ ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓడిపోతే టాప్-2 రేసు నుంచి నిష్ర్కమిస్తుంది. అదే సమయంలో ముంబై జట్టు టాప్ -2 ప్లేసులోకి దూసుకెళ్తుంది.
♦ పంజాబ్పై ముంబై విజయం సాధించినప్పటికీ టాప్-2 రేసులో ప్లేస్ ఖాయమవుతుందని చెప్పలేం. ఎందుకంటే గుజరాత్, బెంగళూరు జట్లు కూడా టాప్-2 ప్లేస్ల కోసం పోటీపడుతున్నాయి.
♦ ఒకవేళ గుజరాత్ జట్టు చెన్నైపై ఓడిపోతే పాయింట్ల పట్టికలో 18 పాయిట్లతో ఆగిపోతుంది. అదే సమయంలో ముంబై జట్టు పంజాబ్ కింగ్స్ పై మెరుగైన రన్ రేటుతో విజయం సాధిస్తే టాప్ -2 రేసులో తన స్థానం పదిలం చేసుకుంటుంది.
♦ ప్రస్తుతం గుజరాత్ రన్ రేటు ప్లస్ 0.602గా ఉంది. ముంబై ఇండియన్స్ ప్లస్ 1.292 రన్ రేటుతో మెరుగైన స్థానంలోనే ఉంది.
♦ గుజరాత్ ఇవాళ్టి చెన్నై మ్యాచ్లో ఓడిపోయి.. పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తే రెండు జట్లు 18 పాయింట్లతో సమం అవుతాయి.
♦ రన్ రేట్ ఆధారంగా ముంబై జట్టు టాప్-2 ప్లేస్ను ఖాయం చేసుకున్నట్లవుతుంది.
♦ ఒకవేళ చెన్నై జట్టుపై గుజరాత్ ఓడిపోయి.. పంజాబ్ కింగ్స్ పై ముంబై గెలిచి.. ఈనెల 27న ఆర్సీబీ జట్టుపై లక్నో జట్టు విజయం సాధిస్తే.. ముంబై జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లే అవకాశం కూడా ఉంది.
🚨 MADNESS IN TOP 4 IN IPL 2025 🥶 pic.twitter.com/G8Arkgcv6F
— Johns. (@CricCrazyJohns) May 24, 2025