ఇక ఫ్యాన్స్ దృష్టంతా ప్లేఆఫ్స్పైనే.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్కు వెళ్తుందా? ఇలా జరిగితేనే ఛాన్స్.. లేదంటే..
నిన్నటి మ్యాచులో గెలిచి గుజరాత్ జట్టు ప్లేఆఫ్స్లో నిలిచింది. అలాగే, బెంగళూరు, పంజాబ్ కూడా ప్లేఆఫ్స్కు వెళ్లాయి.

Pic: @DelhiCapitals (X)
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా, 200 రన్స్ టార్గెట్ను గుజరాత్ 6 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ప్రస్తుతం ఐపీఎల్ ఫ్యాన్స్ దృష్టంతా ఏ జట్టు ప్లేఆఫ్స్లోకి వెళ్తుందన్న దానిపైనే ఉంది. నిన్నటి మ్యాచులో గెలిచి గుజరాత్ జట్టు ప్లేఆఫ్స్లో నిలిచింది. అలాగే, బెంగళూరు, పంజాబ్ కూడా ప్లేఆఫ్స్కు వెళ్లాయి. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ కు 18, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 17, పంజాబ్ కింగ్స్ కు 17, ముంబై ఇండియన్స్ కు 14, ఢిల్లీ క్యాపిటల్స్ కు 13 పాయింట్లు ఉన్నాయి.
Also Read: పాకిస్థాన్లో టెర్రరిస్ట్ సైఫుల్లా ఖతం.. నడిరోడ్డుపై కాల్చి చంపేశారు..
దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్కు చేరుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 12 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ జట్టు 6 విజయాలు సాధించి, ఐదో స్థానంలో ఉంది. ఇక డీసీ ఆడే చివరి రెండు మ్యాచ్ల్లోనూ గెలిస్తేనే ప్లేఆఫ్స్ కు చేరుతుంది. ఒక్క మ్యాచ్ లో ఓడిపోయినా ఆ అవకాశం దక్కదు.
ఢిల్లీ నెక్ట్స్ మ్యాచులు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్తో ఉన్నాయి. ఒకవేళ ఈ రెండు మ్యాచ్ల్లోనూ ఢిల్లీ గెలిస్తే ముంబై ఇండియన్స్ కు ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉండదు. ఇప్పటికే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ ప్లేఆఫ్స్ లో నిలిచాయి. ఇప్పుడు ఇక పోటీ అంతా నాలుగో స్థానం కోసమే. ఈ రేసులో ముంబై, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. లెక్కలను బట్టి చూస్తే ప్లేఆప్స్ చేరే అవకాశాలు ముంబైకే అధికంగా ఉన్నాయి.