నోటీసులే కారణమా : CAC చీఫ్ పదవికి కపిల్ దేవ్ రాజీనామా

  • Published By: venkaiahnaidu ,Published On : October 2, 2019 / 10:45 AM IST
నోటీసులే కారణమా : CAC చీఫ్ పదవికి కపిల్ దేవ్ రాజీనామా

Updated On : October 2, 2019 / 10:45 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ క్రికెట్ సలహా కమిటీ(CAC)చీఫ్ పదవికి రాజీనామా చేశారు. బుధవారం(అక్టోబర్-2,2019)సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పాలకమండలికి ఆయన ఈ మేరకు ఈ మెయిల్ పంపారు. రెండు రోజుల క్రితమే సీఏసీ సభ్యురాలు,మాజీ టీమిండియా మహిళ కెప్టెన్ శాంత రంగస్వామి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ కు కూడా డైరక్టర్ గా వ్యవహిరంచిన శాంత తన రెండు పదవులకు రాజీనామా చేసి ఐసీఏలో సామాన్య సభ్యురాలిగా కొనసాగేందుకు ధరఖాస్తు చేసుకున్నారు.

గత జులై నెలలో బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్‌ సలహా మండలిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కపిల్‌దేవ్‌, శాంత రంగస్వామి, అన్షుమాన్ గైక్వాడ్‌ సభ్యులు. ఈ కమిటీ ఇటీవలే టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రిని ఎంపిక చేసింది. అంతకుముందు భారత మహిళల జట్టుకు కోచ్‌ను కూడా ఎంపిక చేసింది. కపిల్‌దేవ్‌ వ్యాఖ్యాతగా, ఫ్లడ్‌లైట్ల సంస్థ అధిపతిగా, భారత క్రికెటర్ల సంఘం(ఐసీఏ)సభ్యుడిగా ఉన్నారు. గైక్వాడ్‌ సొంత అకాడమీతో పాటు బీసీసీఐ అఫిలియేషన్‌ కమిటీలో సభ్యులు. శాంత కూడా ఐసీఏ సభ్యురాలు. అందరూ పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తారని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా బీసీసీఐ ఎథిక్స్ అధికారి డీకే జైన్‌కు కంప్లెయింట్  చేసాడు. దీంతో డీకే జైన్‌… అక్టోబర్‌ 10లోగా వివరణ ఇవ్వాలని CACకి నోటీసులు పంపారు.

ఇప్పటికే నోటీసులు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శాంత రంగస్వామి సీఏసీ నుంచి తప్పుకున్నారు. తాజాగా సీఏసీ నుంచి కపిల్‌దేవ్‌ కూడా తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశంపై నోటీసుల రావడంతో కపిల్‌దేవ్‌ ఆగ్రహంగా ఉన్నారు అని ఆయన సన్నిహిత వర్గాల నుండి సమాచారం తెలుస్తోంది. అంతేకాకుండా దీనిపై ఎవరికి సమాధానం చెప్పే ఇష్టం లేకనే తప్పుకుంటున్నట్లు సమాచారం