ధోనీ కోపానికి వెనకడుగేసిన అంపైర్, ఎందుకంటే..

మ్యాచ్ నిబంధనలు.. క్రికెట్ నియమాల విషయంలో ఒక్కోసారి ధోనీకి మాత్రమే ప్రత్యేకమైన నిబంధనలు వర్తిస్తుంటాయి. ఈ విషయంలో అంపైర్లు కూడా ధోనీ ముందు వెనుకడుగేయాల్సిందే. కూల్ నెస్ కు మారుపేరైన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మైదానంలో ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ స్థితిలో ధోనీ కోపం చూసిన అంపైర్ కూడా ఏం మాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోయాడు.
శనివారం చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై 160 పరుగులు చేసి పంజాబ్ కు సవాల్ విసిరింది. దాదాపు గెలిచేశామనుకుంటున్న తరుణంలో చివరి 2 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సి వచ్చింది. ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ చేతికి బౌలింగ్ అప్పగించాడు ధోనీ. ఒత్తిడికి గురైన చాహర్ తొలి రెండు బంతుల్ని నోబాల్స్గా విసిరాడు.
ఆ ఓవర్లో ఒక్క బంతి కూడా పడకుండానే.. 8 పరుగులు పంజాబ్ ఖాతాలో చేరాయి. దీంతో.. కెప్టెన్ కూల్ కు సహనం తగ్గిపోయింది. ఆగ్రహంతో చాహర్ కు క్లాస్ పీకుతున్నాడు. ఆ సమయంలో నో బాల్స్ వేసినందుకు చాహర్ ను వారించేందుకు ఫీల్డ్ అంపైర్ దగ్గరికి వచ్చాడు. ధోనీని చూసి వెనక్కితగ్గాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం.. ఒకే ఓవర్లో బౌలర్ రెండు బీమర్స్ విసిరిన తర్వాత.. అతడ్ని బౌలింగ్ నుంచి అంపైర్స్ తప్పిస్తారు.
ఆ తర్వాత చాహర్.. ఒకే ఓవర్లో తొలి 5 బంతులకి 1, 1, 1, 1, 1 రూపంలో సింగిల్స్ ఇచ్చాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి మిల్లర్ వికెట్ తీయడం తీసి మ్యాచ్ను చెన్నై వైపుకు తిప్పాడు. 2 రోజుల క్రితం కోల్కతాతో మ్యాచ్లో బ్యాట్స్మెన్ శరీరంపైకి 2 బీమర్స్ విసిరిన బెంగళూరు బౌలర్ సిరాజ్ను అంపైర్లు బౌలింగ్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఓవర్లో మిగిలిన బంతుల్ని స్టయినిస్తో కోహ్లీ వేయించగా.. రసెల్ సిక్సర్లు బాది.. కోల్కతాను విజయతీరాలకు చేర్చాడు.