IND vs NZ: బెంగళూరు టెస్టులో భారత్ ఓటమి.. 36ఏళ్ల నిరీక్షణకు తెరదించిన న్యూజిలాండ్
బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టుపై న్యూజిలాండ్ విజయం సాధించింది. టెస్టు మ్యాచ్ లో భాగంగా ఐదోరోజు ...

New Zealand Team
IND vs NZ 1st Test: బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టుపై న్యూజిలాండ్ విజయం సాధించింది. టెస్టు మ్యాచ్ లో భాగంగా ఐదోరోజు 107 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ జట్టులో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్కోర్ బోర్డు తెరవకుండానే ఓపెనర్ టామ్ లేథమ్ ను భారత్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఔట్ చేశాడు. కొద్దిసేపటి తరువాత డేవన్ కాన్వే(17)ను కూడా బుమ్రా ఔట్ చేశాడు. దీంతో కివీస్ జట్టుపై భారత్ పట్టుబిగిస్తున్నట్లు కనిపించింది. కానీ, ఆ తరువాత వికెట్ కోల్పోకుండా విల్ యంగ్ (48), రచిన్ రవీంద్ర (39) పరుగులతో న్యూజిలాండ్ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో న్యూజిలాండ్ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
భారత్ జట్టుపై విజయంతో 36ఏళ్ల నిరీక్షణకు న్యూజిలాండ్ తెరదించింది. భారత్ లో చివరిసారిగా 1988లో న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ విజయం సాధించింది. ఆ తరువాత ఇప్పటి వరకు ఒక్క టెస్టు మ్యాచ్ లోనూ భారత్ పై కివీస్ జట్టు విజయం సాధించలేదు. ఇప్పటి వరకు న్యూజిలాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారతదేశంలో భారత్ జట్టును మూడు సార్లు ఓడించింది. 1969లో 167 పరుగుల తేడాతో కివీస్ తొలిసారి విజయం సాధించింది. 1988లో 136 పరుగుల తేడాతో రెండోసారి విజయం సాధించింది. 2024లో ఎనిమిది వికెట్ల తేడాతో మూడోసారి న్యూజిలాండ్ జట్టు టీమిండియాపై విజయం సాధించింది.
మరోవైపు ఈ ఏడాది ఇంగ్లండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ ను టీమిండియా స్వదేశంలో ఓడిపోయింది. ఆ తరువాత మరో భారత్ జట్టుకు మరో ఓటమి ఎదురైంది.
- బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో టెస్టు మ్యాచ్ జరిగింది.
- తొలిరోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది.
- రెండో రోజు మ్యాచ్ ప్రారంభంకాగా.. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
- తొలి ఇన్నింగ్స్ లో కేవలం 46 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది.
- బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 402 పరుగులు చేసింది. తద్వారా తొలిఇన్నింగ్స్ లో భారత్ పై 356 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.
- కివీస్ జట్టులో రచిన్ రవీంద్ర 134 పరుగులు చేయగా.. టీమ్ సౌదీ 65 పరుగులు చేశాడు.
- రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా బ్యాటర్లు ఆదినుంచి దూకుడుగా ఆడారు.
- ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (35), రోహిత్ శర్మ (52) పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ (70) పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.
- యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులు చేయగా.. రిషబ్ పంత్ 99 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు పెద్దగా పరుగులు రాబట్టలేక పోయారు.
- టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 462 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా కివీస్ కు 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
- న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. దీంతో తొలి టెస్టు విజేతగా నిలిచింది.
- రెండో టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 24 నుంచి 30 వరకు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది.
🚨 HISTORY AT CHINNASWAMY 🚨
NEW ZEALAND DEFEATED INDIA IN INDIA IN A TEST AFTER 36 YEARS. pic.twitter.com/NgMY7KT1YX
— Johns. (@CricCrazyJohns) October 20, 2024
FIRST TEST WIN FOR NEW ZEALAND IN INDIA IN THIS CENTURY 🙇 pic.twitter.com/abhE9a1KqF
— Johns. (@CricCrazyJohns) October 20, 2024