Emerging Asia Cup : సాయి సుదర్శన్ అజేయ సెంచరీ.. పాక్ పై భారత్ విజయం
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది. పాకిస్తాన్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత ఆటగాడు సాయి సుదర్శన్ (Sai Sudarshan) అజేయ సెంచరీతో చెలరేగాడు.
![Emerging Asia Cup : సాయి సుదర్శన్ అజేయ సెంచరీ.. పాక్ పై భారత్ విజయం Emerging Asia Cup : సాయి సుదర్శన్ అజేయ సెంచరీ.. పాక్ పై భారత్ విజయం](https://10tv.in/wp-content/uploads/2023/07/IND-A-vs-PAK-A.jpg)
IND A vs PAK A
Emerging Asia Cup 2023 : ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది. పాకిస్తాన్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత ఆటగాడు సాయి సుదర్శన్ (Sai Sudarshan) అజేయ సెంచరీతో చెలరేగాడు. దీంతో పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని టీమ్ఇండియా 36.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఎమర్జింగ్ ఆసియా కప్-2023లో భాగంగా బుధవారం శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల ధాటికి తొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే.. కాసిం అక్రమ్(48), షాహిజాదా ఫర్హాన్(35), హసీబుల్లా ఖాన్(27), ముబాసిర్ ఖాన్(28) రాణించడంతో 48 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో పేసర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్ (Rajvardhan Hangargekar) ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. మానవ్ సుతార్ మూడు వికెట్లు తీయగా రియాన్ పరాగ్, నిషాంత్ సింధు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
Make that 3️⃣ wins in a row for India ‘A’ in the #ACCMensEmergingTeamsAsiaCup!
A formidable eight-wicket win over Pakistan ‘A’ 👏🏻👏🏻
Scorecard – https://t.co/6vxep2BpYw #ACC pic.twitter.com/0iAiO8VkoY
— BCCI (@BCCI) July 19, 2023
అనంతరం సాయి సుదర్శన్ (104 నాటౌట్; 110 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ, నికిన్ జోస్(53; 64 బంతుల్లో 7 ఫోర్లు) అర్థశతకాలతో రాణించడంతో భారత్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. మిగిలిన వారిలో అభిషేక్ శర్మ(20) నిరాశ పరచగా, కెప్టెన్ యశ్ ధుల్ 19 బంతుల్లో 21 పరుగుతో అజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో భారత్కు ఇది వరుసగా మూడో విజయం.