ఐపీఎల్ 2025 ముగిసింది.. ఇక T20 World Cup 2026లో ఈ ప్లేయర్లకు ఛాన్స్ దక్కినట్లే?
తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు

Suryakumar Yadav
ఐపీఎల్ 2025 ఇటీవలే ముగిసింది. ఇక ఐపీఎల్ 2026 కంటే ముందు భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ ఆడుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో టీ20 ప్రపంచ కప్ జరగనుంది.
భారత్, శ్రీలంక వేదికగా ఈ మ్యాచులు జరుగుతాయి. 2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన టీమిండియా.. ఈ సారి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 2026 టీ20 ప్రపంచ కప్ ఆడే అవకాశం ఉంది. మరోసారి టైటిల్ దక్కించుకోవాలనుకుంటోంది.
అలాగే, శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులో ఉండే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ జట్టులో ఉండే అవకాశం మాత్రం లేదు. ఐపీఎల్ 2025.. టీ20 ప్రపంచ కప్ ముందు జరిగిన చివరి ఐపీఎల్. భారత జట్టులో చోటు సంపాదించుకోవడానికి యువ ఆటగాళ్లకు దక్కిన చివరి అవకాశం ఐపీఎల్ 2025. అంటే ఈ ఐపీఎల్లో బాగా ఆడి సెలెక్టర్ల దృష్టిలో పడిన వారు భారత టీ20 జట్టులో చేరే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత రోహిత్ శర్మ పదవీ విరమణ చేశాడు. ఆ తర్వాత సూర్యకుమార్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారత్ 15 మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచ్లలో మాత్రమే మన జట్టు ఓడిపోయింది. ప్రస్తుతం టీమిండియా బలంగా ఉంది.
శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ టీ20 క్రికెట్లోకి తిరిగి రావాలని భావిస్తున్నారు. గత సంవత్సరం, వారు టీ20లు ఆడలేదు. ఎందుకంటే అప్పుడు వారి దృష్టి అంతా టెస్ట్ మ్యాచ్లు, ఛాంపియన్స్ ట్రోఫీపైనే ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇటీవలి ఐపీఎల్ మ్యాచుల్లో బాగా ఆడారు.
దీంతో వీరిద్దరు ఇక టీ20ల్లో కీలక పాత్ర పోషిస్తారని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల భారత టెస్ట్ జట్టు కెప్టెన్గా గిల్ ఎంపికయ్యాడు. గిల్ చివరిసారిగా ఆడిన టీ20 మ్యాచ్లో (శ్రీలంకతో) వైస్-కెప్టెన్గా ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్లో కూడా అతడిని వైస్-కెప్టెన్గా ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదు.
ఇక అభిషేక్ శర్మ తన చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచులో ఇంగ్లాండ్పై 37 బంతుల్లో సెంచరీతో చెలరేగాడు. అతని ఎడమచేతి వాటం స్పిన్ కూడా జట్టుకు కీలకంగా మారుతుంది.
ఇక మిడిల్ ఆర్డర్ విషయానికొస్తే తిలక్ వర్మ దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్పై కూడా బాగా ఆడాడు. అతడు జట్టులో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
శ్రేయస్ అయ్యర్ 2023 డిసెంబర్ నుంచి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడలేదు. అయితే, ఇటీవల జరిగిన ఐపీఎల్లో అద్భుతంగా ఆడాడు. గత ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడికి జట్టులో ప్లేస్ కన్ఫాం అని చెప్పవచ్చు. అంతేకాదు, శ్రేయస్ కూడా కెప్టెన్సీ పోటీలో ఉండవచ్చు.
వికెట్ కీపర్ బ్యాటర్ల విషయానికొస్తే 2024లో మూడు సెంచరీలు చేసిన సంజు శాంసన్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. రిషబ్ పంత్ జట్టులోకి తిరిగి రావడంలో విఫలమవడంతో రెండవ స్థానం ఖాళీగా ఉంటుంది.
ఇక ఆల్ రౌండర్ల విషయానికొస్తే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ను తీసుకునే ఛాన్స్ ఉంది. స్టార్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువ. 2024 T20 ప్రపంచ కప్ విజయంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ కీలక పాత్ర పోషించారు. 2026లో కూడా ఇద్దరూ కీలకంగా మారనున్నారు.