Rishabh Pant : మృత్యువును జయించిన రిషబ్ పంత్.. ఏడాది పూర్తి.. ఆ రోజు ఏం జరిగిందంటే..?
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు (డిసెంబర్ 30, 2022) టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
![Rishabh Pant : మృత్యువును జయించిన రిషబ్ పంత్.. ఏడాది పూర్తి.. ఆ రోజు ఏం జరిగిందంటే..? Rishabh Pant : మృత్యువును జయించిన రిషబ్ పంత్.. ఏడాది పూర్తి.. ఆ రోజు ఏం జరిగిందంటే..?](https://10tv.in/wp-content/uploads/2023/12/New-Project-3-39.jpg)
Rishabh Pant
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు (డిసెంబర్ 30, 2022) టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవే పై జరిగిన ప్రమాదం పంత్ కెరీర్ గమనాన్ని మార్చి వేసింది. తన తల్లితో కలిసి రాబోయే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పంత్ భావించాడు. దీంతో ఢిల్లీ నుంచి తన కారులో రూర్కీ బయలు దేరాడు. అయితే.. అతడు ప్రయాణిస్తున్న ఉత్తరాఖండ్లోని హమ్మద్పూర్ ఝల్ సమీపంలో అదుపు తప్పి హైవే డివైడర్ను ఢీ కొట్టింది.
దీంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. అలాగే రోడ్డు పై కొంత దూరం కారు ముందుకు వెళ్లడంతో మంటలు చెలరేగాయి. అయితే.. పంత్ కారు ముందు అద్దాలు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చాడు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. సుశీల్ అనే ట్రక్ డ్రైవర్ ఈ ప్రమాదాన్ని గమనించి పంత్కు సాయం చేశాడు. ఈ ప్రమాదంలో పంత్ తలకు, కాళ్లకు, వెన్నుకు గాయాలు అయ్యాయి. అతడిని వెంటనే డెహ్రాడూన్లోని ఓ ఆసత్రికి తరలించి చికిత్స అందించారు.
ఆ తరువాత ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో పంత్ మోకాలికి శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స అనంతరం కోలుకున్న పంత్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి వచ్చి ఫిట్నెస్ సాధించే పనిలో నిమగ్నమయ్యాడు. కాగా.. ప్రమాదం జరిగిన సంవత్సరం అవ్వడంతో రిషబ్ పంత్ తన గాయాలనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. గాయం తేలికపాటి గుర్తులు ఆ ఫోటోల్లో కనిపిస్తున్నాయి.
పునరాగమనం ఎప్పుడంటే..?
రోడ్డు ప్రమాదం తరువాత ఆటకు దూరమైన పంత్ ప్రస్తుతం మైదానంలో మళ్లీ అడుగుపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు తన ఫోటోలను పంచుకుంటూనే ఉన్నాడు. తాజాగా లెగ్ వర్కౌట్ ఫోటోలు పోస్ట్ చేశాడు. దీంతో పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించాడని తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున పంత్ బరిలోకి దిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాగా.. పంత్ సారథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగనుంది.