Asaduddin Owaisi: వీరి నాయకత్వంలో దేశంలో మూడో ఫ్రంట్..: అసదుద్దీన్ ఒవైసీ
కేసీఆర్తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఎన్డీఏ, ఇండియాలో లేరని..
![Asaduddin Owaisi: వీరి నాయకత్వంలో దేశంలో మూడో ఫ్రంట్..: అసదుద్దీన్ ఒవైసీ Asaduddin Owaisi: వీరి నాయకత్వంలో దేశంలో మూడో ఫ్రంట్..: అసదుద్దీన్ ఒవైసీ](https://10tv.in/wp-content/uploads/2023/09/676cafd3-77e3-4fc9-9906-5caeb4d64e4a.jpg)
Asaduddin Owaisi
Asaduddin Owaisi: దేశంలో మూడో కూటమి ఏర్పాటు చేసుకునేందుకు ఆస్కారం ఉందని ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ మూడో కూటమికి నాయకత్వం వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)ను కోరుతున్నట్లు చెప్పారు.
ఇవాళ అసదుద్దీన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కేసీఆర్తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఎన్డీఏ, ఇండియాలో లేరని గుర్తుచేశారు. అలాగే, మరికొన్ని పార్టీలు కూడా ఈ రెండు కూటముల్లో లేవని అన్నారు. దీంతో మూడో కూటమిపై కేసీఆర్ చొరవ చూపుతారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
దేశంలో మూడో కూటమి కోసం చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ లేకుండానే కూటమి ఏర్పాటు చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో వేర్వేరుగా ప్రకటనలు చేసినప్పటికీ అది ముందుకు సాగలేదు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ ఇప్పటికే తమ కూటమిని మరింత బలపర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇండియా పేరిట కూటమిని ఏర్పాటు చేసిన విపక్షాలు తమ వ్యూహం, ప్రణాళికల గురించి ఇప్పటికే చర్చించాయి.
హైదరాబాద్ లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశం గురించి అసదుద్దీన్ స్పందించారు. దళితులు, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచాలని సీడబ్ల్యూసీ ప్రతిపాదనలు చేసిందని, మరి ముస్లింల సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు. అలాగే, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల గురించి వారు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.
ఈ విషయాన్ని తాను పార్లమెంటులో పదే పదే అడుగుతున్నానని చెప్పారు. రిజర్వేషన్లపై కపట ధోరణితో కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో మైనారిటీల రిజర్వేషన్ల కోసం ఏం చేసిందని నిలదీశారు.