కరోనా పంజా, ప్రజలకు సీఎం కేసీఆర్ వార్నింగ్

తెలంగాణ ప్రజలను కరోనా వైరస్‌ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి 18,2020) రాత్రి

  • Published By: veegamteam ,Published On : March 19, 2020 / 02:44 AM IST
కరోనా పంజా, ప్రజలకు సీఎం కేసీఆర్ వార్నింగ్

Updated On : March 19, 2020 / 2:44 AM IST

తెలంగాణ ప్రజలను కరోనా వైరస్‌ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి 18,2020) రాత్రి

తెలంగాణ ప్రజలను కరోనా వైరస్‌ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి 18,2020) రాత్రి ఒకేసారి ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. వాస్తవానికి 2020, మార్చి 18వ తేదీ బుధవారం సాయంత్రం వరకు కొవిడ్‌-19 కేసులు 6 నమోదయ్యాయి. రాత్రి 10 గంటల సమయంలో కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మరో ఏడు కొత్త కేసులు నమోదైనట్టు వెల్లడించింది. మొత్తంగా బుధవారం ఒక్క రోజే 8 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి పెరిగింది. దీంతో తెలంగాణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇండోనేషియా నుంచి వచ్చిన 11మందిలో ఏడుగురికి కరోనా:
కొత్తగా కరోనా పాజిటివ్‌గా తేలిన బాధితులెవరూ తెలంగాణ వారు కాదు. వారంతా ఇండోనేషియాకు చెందినవారే. ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉండడంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారికి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

క్వారంటైన్ కేంద్రంలో ఉన్నవారి కోసం ఎవరూ వెళ్లకూడదు:
కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సీఎం కేసీఆర్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. కీలక ఆదేశాలు జారీ చేశారు. క్వారంటైన్ కేంద్రాల సందర్శనపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. క్వారంటైన్ కేంద్రంలో ఉన్నవారి కోసం ఎవరూ వెళ్లకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

కరీనంనగర్ లో హైఅలర్ట్:
పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరీంనగర్‌లో కరోనా డేంజర్‌ బెల్‌ మోగింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన 11మందిలో ఏకంగా ఏడుగురికి కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఆందోళన మొదలైంది. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కరీంనగర్‌ పట్టణంలో హైఅలర్ట్‌ ప్రకటించింది. కలెక్టరేట్‌కు మూడు కిలోమీటర్ల మేర దిగ్బంధించారు. ఎవరినీ అటువైపు వెళ్లనీయడం లేదు. అక్కడ ఉన్న వారిని బయటకు రానివ్వడం లేదు. అందరినీ ఒక రకంగా గృహ నిర్భంధం చేశారు.

సంపర్క్ క్రాంతి-ఎస్9 బోగీలో రామగుండం వచ్చారు:
ఇండోనేషియా నుంచి 11మంది ఇస్లామిక్ మత ప్రచారకులు ఢిల్లీ వచ్చారు. మార్చి 14న ఢిల్లీ నుంచి రైలులో(సంపర్క్ క్రాంతి-ఎస్9 బోగీలో) రామగుండం చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనంలో కరీంనగర్‌ వచ్చారు. నగరంలోని రెండు ప్రార్థనా మందిరాల్లో మత కార్యక్రమాలు నిర్వహించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారి గురించి అధికారులకు మార్చి 16న తెలిసింది. వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కరోనా లక్షణాలు కనిపించడంతో వారందరినీ హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలో వారి శాంపిల్స్‌ సేకరించి పుణె ల్యాబ్‌కు పంపారు. బుధవారం రాత్రి రిపోర్ట్స్‌ అందగా అందులో ఏడుగురికి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో కర్ఫ్యూ వాతావరణం:
ఇండోనేషియా నుంచి వచ్చిన వారు కరీంనగర్ లో 48 గంటలు ఉన్నట్టు అధికారులు తెలుసుకున్నారు. కలెక్టరేట్‌ పరిధిలోని 3 ప్రార్థనా మందిరాల్లో వారంతా గడిపినట్టు అధికారులు గుర్తించారు. దీంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. కలెక్టరేట్‌ కేంద్రంగా 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. గురువారం(మార్చి 19,2020) నుంచి 100 వైద్య బృందాలను రంగంలోకి దింపనున్నారు. వారు నగరంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయనున్నారు. 4 రోజుల పాటు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను కోరారు అధికారులు.

కరీంనగర్ నగరంలో హోటళ్లు, దుకాణాలు బంద్:
కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు కరీనంగర్‌ కలెక్టర్‌. వైరస్‌ను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న రోడ్డును పూర్తిగా మూసివేశారు. దుకాణాలు, హోటళ్లు మూసివేయించి అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారు బస చేసిన ప్రార్థనా మందిరాలను రసాయనాలతో శుభ్రపరిచారు. ఆ ప్రాంతమంతా మందులు, బ్లీచింగ్‌ పౌడర్‌ స్ర్పే చేశారు. అంతేకాదు 144 సెక్షన్‌ను విధించి ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు.

కరీంనగర్‌ నగరంలో 20 ఐసొలేషన్‌, 10 ఐసీయూ బెడ్లు:
కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో 20 ఐసొలేషన్‌, 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు. రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 చొప్పున బెడ్స్‌ను సిద్ధం చేశారు. కరీంనగర్‌ నగరమంతటా శానిటైజేషన్‌ చేశారు. జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి.. ప్రజలను గుమికూడొద్దని ప్రచారం చేస్తున్నారు. అత్యవసరంగా చికిత్స అందజేసేందుకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read | ఢిల్లీలో కలకలం : కరోనా అనుమానిత రోగి ఆత్మహత్య