CM Revanth Reddy : పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు.. కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy : కొండా సురేఖ విషయం క్రమ శిక్షణ కమిటీ పరిశీలనలో ఉందని, పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటామన్నారు. పార్టీ అంతర్గత విషయాలు మీడియా ముందు మాట్లాడనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
CM Revanth Reddy
- కొండా సురేఖ విషయం క్రమ శిక్షణ కమిటీ పరిశీలనలో ఉంది
- పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటాం
- పార్టీ అంతర్గత విషయాలు మీడియా ముందు మాట్లాడను
CM Revanth Reddy : మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ టైమ్ స్పందించారు. కొండా సురేఖ విషయం ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉందన్నారు. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటామని చెప్పారు.
పార్టీ అంతర్గత విషయాలను మీడియా మీద తాను మాట్లాడనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ లైన్కు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, క్రమశిక్షణ ఉల్లంఘనపై పార్టీ కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కొండా సురేఖ కూడా లేఖలో తన వివరణ ఇచ్చారు. అయితే, ఇప్పటివరకూ ఈ విషయంపై సీఎం రేవంత్ స్పందించలేదు.
ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు ఆయన చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ అంశంగా కాదని, పార్టీ అంతర్గత విషయంగానే చూడాలని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. పార్టీ లైన్ ఎవరైనా దాటినా ఆ అంశంపై తగిన నిర్ణయం తీసుకునే బాధ్యత క్రమశిక్షణ కమిటీదేనని పేర్కొన్నారు. తనతో సహా ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కొండా సురేఖకు సంబంధించిన అంశాన్ని పార్టీ అధిష్టానం, ఏఐసీసీ స్థాయిలో పరిశీలిస్తారని తెలిపారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ప్రభుత్వ వేదికల నుంచి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ పరిధిలోనే ఉందని రేవంత్ స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని విషయాలపై స్పష్టత వస్తుందని చెప్పారు.
