Cm Revanth Reddy: ఇది కాంగ్రెస్ విజయం, దేనికైనా నేను సిద్ధం, తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శం- బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్

రిజర్వేషన్ల విషయంలో నన్ను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు. నా నిబద్దతను ప్రశ్నించలేరు.

Cm Revanth Reddy: ఇది కాంగ్రెస్ విజయం, దేనికైనా నేను సిద్ధం, తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శం- బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్

Updated On : July 12, 2025 / 10:05 PM IST

Cm Revanth Reddy: వందేళ్ల బీసీల ఆకాంక్షను రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్లు గొప్ప కార్యక్రమం అన్నారు. ఆనాడు దళితులు, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించిందని రేవంత్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చిందన్నారు. కులగణన చేస్తామని రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో స్పష్టం చేశారన్న రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ మాట మాకు శిలాశాసనం అని చెప్పారు.

నాయకుడు మాట ఇస్తే దాన్ని నేరవేర్చాల్సిన బాధ్యత నాది, మా పీసీసీ అధ్యక్షుడిది అని వెల్లడించారు. కులగణనపై ఎన్నో అవాంతరాలు వచ్చినా వాటిని అధిగమించామన్నారు. ఏడాదిలో పూర్తి పారదర్శకంగా, పక్కాగా కులగణన పూర్తి చేశామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు.

”ఫిబ్రవరి 4వ తేదీని సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించుకున్నాం. అసెంబ్లీతో పాటు అన్ని వర్గాలతో కులగణనపై చర్చించాం.. అందరి అభిప్రాయాలను తీసుకున్నాం. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ మోడల్ లో కులగణన చేయాలని దేశమంతా చెబుతున్నారు. కులగణనకు మేం వ్యతిరేకమని బీజేపీ గతంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో చేర్చాలని జంతర్ మంతర్ లో నిర్వహించిన ధర్నాకు 16 పార్టీలు మద్దతిచ్చాయి. మన ఒత్తిడికి లొంగే కేంద్రం 2026లో జరిగే జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించింది. తెలంగాణ నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసింది. బీసీ రిజర్వేషన్లపై మాకు చిత్తశుద్ధి లేదని కొందరు విమర్శిస్తున్నారు. చిత్తశుద్ది లేనిది బీజేపీకే.

Also Read: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై పంచాయితీ తేలేనా? ఆర్డినెన్స్‌ తెస్తే గవర్నర్ సంతకం చేస్తారా?

బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ చేర్చి చట్టబద్దత కల్పించాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఆర్ క్రిష్ణయ్య దీన్ని సాధించాలి. మోదీ స్థానంలో రాహుల్ గాంధీ ఉంటే 48 గంటల్లో నేను రిజర్వేషన్లను సాధించుకు వచ్చేవాడిని. ప్రధాని మోదీని తెలంగాణకు చెందిన బీజేపీ మంత్రులు ప్రశ్నించాలి. బీజేపీ నాయకులు వాళ్ల నిబద్ధతను చూపించాలి. రిజర్వేషన్ల కోసం ఇంకా ఏం చేయాలన్నా నేను సిద్ధం.. ఏం చేయాలో చెప్పండి.. అర్ధరాత్రి కూడా నా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తా.

రిజర్వేషన్ల విషయంలో నన్ను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు. నా నిబద్దతను ప్రశ్నించలేరు. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసమే ఇంత కాలం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశాం. 50శాతానికి మించి రిజర్వేషన్లు పెంచొద్దని గత కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం చేసింది.

ఈ చట్టం చేసినప్పుడు మంత్రులుగా గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. కేసీఆర్ ఇప్పుడు వాళ్లను మాపైకి ఉసిగొల్పుతున్నారు. ఆ చట్టంలో పేర్కొన్న 50 శాతం నిబంధనను సవరిస్తూ మేమిప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాపత్రయం పడుతున్నది నేను. నాకు తోడుగా ఉండండి.. రక్షణ కవచంలా ఉండి రిజర్వేషన్లను కాపాడుకోవాలి.

రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకు వెళ్తే వాదించడానికి ఢిల్లీ నుంచి ఉద్దండులైన న్యాయవాదులను వాదనల కోసం నియమిస్తా. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాగితం పెట్టిన వాళ్ళని, కాగితం పెట్టించిన వాళ్లను సామాజిక బహిష్కరణ చేస్తామని ప్రకటించండి. 42శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తాం. అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలైతేనే నిజమైన విజయం. 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన జెండా కావాలి” అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.