Uttam Kumar Reddy : పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా.. సీఎం పదవి ఆశించటం తప్పు కాదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. అధిష్టానం నిర్ణయం ప్రకటనతోనే ఈ ఉత్కంఠకు తెరపడనుంది. ఈక్రమంలో సీఎం పదవి ఆశించేవారి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Uttam Kumar Reddy sensational comments : తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కొనసాగే విషయమే ఇప్పుడు కూడా జరుగుతోంది. ఈక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో పలువురు సీఎం పదవిని ఆశిస్తున్నారు. సీఎం పదవికి తాను అర్హుడిని అంటే తాను కూడా అర్హుడినే అనే ఆశల్ని వ్యక్తపురుస్తున్నారు. కానీ.. సీఎం అభ్యర్థి ఎవరో తేల్చటానికి అధిష్టానం ఉదయం నుంచి మల్లగుల్లాలు పడుతునే ఉంది.
అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమే అంటున్నా.. టీ. కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈక్రమంలో తాను పార్టీ కోసం కష్టపడి పనిచేశానని..సీఎంకు కావాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని తాను సీఎం పదవి ఆశించటం తప్పుకాదు అంటూ ఆ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తన మనసులో మాటను వ్యక్తపరిచారు.
ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, మంత్రి వర్గ కూర్పు, ఇతర అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. తెలిసింది. వీరి మధ్య భేటీ తరువాత ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం ఎవరనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు.కానీ మరోపక్క తనకు సీఎం కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని చెబుతున్నారు.
తాను మొదటినుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని..పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని..తాను కష్టపడి పనిచేసిన విషయాన్ని దీనికి సంబంధించిన అన్ని విషయాలను హైకమాండ్ కు తెలియజేశానని సీఎం పదవి ఆశించటంలో ఏమాత్రం తప్పులేదంటు చెప్పుకొచ్చారు. కానీ సీఎం అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని ప్రకటించినా తనకు ఏమీ అభ్యంతరంలేదన్నారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతునే తనకు సీఎం పదవికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈక్రమంలో సీఎం అభ్యర్థిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే అధిష్టానం ప్రటించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు వస్తున్న డీకే శివకుమార్ అధికారికంగా మరికాసేపట్లో సీఎం అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు.