కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత ఈటల సంచలన కామెంట్స్.. వారిద్దరి వద్దే సమాచారం అంతా.. అలా చేయకుంటే కాంగ్రెస్కు శిక్ష తప్పదు
కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కేసీఆర్, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Etala Rajender
Etala Rajender: మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ పలు అంశాలకు సంబంధించి ఈటలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు గంటన్నర పాటు కాళేశ్వరం కమిషన్ ఈటలను విచారించింది. విచారణ అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
నా 25ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ బాధ్యతలో ఉన్నా నిజాయితీగా పనిచేశానని ఈటల అన్నారు. జలయజ్ఞంలో భాగంగా తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు రూ.16,500 కోట్లు అంచనా వేశారు. ఆ తరువాత రూ.38వేల కోట్లకు పెంచారు. కాళేశ్వరం డిజైన్లతో మీకు సంబంధం ఉందా? అని అడిగారు. డిజైన్, నిర్మాణంతో నాకు సంబంధం లేదని కమిషన్ ముందు చెప్పానని ఈటల అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ తోనూ నాకు సంబంధం లేదని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా.. త్వరగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టును బయటపెట్టండి. నిజమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. దోషులను శిక్షించకపోతే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు శిక్ష తప్పదు అని ఈటల అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సృష్టికర్త తానే అని కేసీఆర్ చెప్పుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారం అంతా కేసీఆర్, హరీశ్ రావు వద్దే ఉందని ఈటల చెప్పారు. ఇందులో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా లేదని అన్నారు. ఆర్థిక శాఖకు అన్ని విషయాలు తెలియవని, కాళేశ్వరం ప్రాజెక్టులో నేనేమీ చేయలేదు.. నా దగ్గర ఏం లేదు.. ప్రాజెక్టు రీ డిజైనింగ్ కోసం క్యాబినెట్ సబ్ కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేశారని.. దీనికి హరీశ్ రావు చైర్మన్ గా ఉన్నారని ఈటల అన్నారు.