Jagadish Reddy : జగన్ సీఎంగా రాష్ట్రానికి వస్తే గౌరవించుకోవద్దా? మీరు చంద్రబాబు దగ్గరికి క్యూ కట్టలేదా?- మంత్రులపై జగదీశ్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడుకుంటే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. ప్రతి దాంట్లో కమిషన్ అడుగుతున్న కాంగ్రెస్ నేతలా కేసీఆర్ గురించి మాట్లాడేది?

Jagadish Reddy : తెలంగాణ దాచి పెట్టుకున్న కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుకెళ్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఏపీ నీటి దోపిడీతో తెలంగాణలో సాగు, తాగు నీళ్లకు కటకట ఏర్పడే పరిస్థితి ఉందని హరీశ్ రావు చెప్పారని అన్నారు. హరీశ్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెత్త మాటలు మాట్లాడారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి మాట్లాడితే కాంగ్రెస్ నేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణలోనూ అన్యాయం చేసింది కాంగ్రెస్, బీజేపీలే అని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ.. తెలంగాణకు సరైన నీటి వాటా దక్కకపోవడానికి కారణం. ఉత్తమ్ కుమార్ ఎవరో రాసిచ్చింది చదివారు. రేవంత్ రెడ్డి తిట్లతో సీఎం అయ్యారు. తాను కూడా అదే భాషతో మాట్లాడితే సీఎం అవుతానని ఉత్తమ్ అనుకుంటున్నారేమో. పదేళ్ల కేసీఆర్ పాలనలో సాగు తాగు నీళ్లకు ఎలాంటి కష్టం వాటిల్ల లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడిన చెత్తనే ఉత్తమ్ కేసీఆర్ మీద మాట్లాడుతున్నారు. ఉత్తమ్ మాట్లాడాల్సింది కేంద్రం మీద, పక్క రాష్ట్రం మీద, చంద్రబాబు మీద.
ఏపీలో ప్రాజెక్టుల మీద జగన్, చంద్రబాబు ఒకే వైఖరి మీద ఉన్నారు. తెలంగాణ లో మాత్రం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు. పోతిరెడ్డిపాడును వ్యతిరేకించి ఆనాడు మా పార్టీ వైఎస్ కేబినెట్ నుంచి బయటకు వచ్చింది. మాట్లాడుకుంటే తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహ చరిత్ర చాలా ఉంది.
కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోసం ప్రయత్నిస్తున్నాం అని ఉత్తమ్ అంటున్నారు. ముందు ఉన్న పంటలను కాపాడటంపై దృష్టి పెట్టాలి. మోదీకి చంద్రబాబుకి ఉత్తమ్ భయపడుతున్నారు. జగన్ సీఎంగా రాష్ట్రానికి వస్తే గౌరవించుకోవద్దా? మీరు చంద్రబాబు దగ్గరికి క్యూ కట్టలేదా? మాట్లాడటానికి సిగ్గు ఉండాలి.
Also Read : ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడుకుంటే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. ప్రతి దాంట్లో కమిషన్ అడుగుతున్న కాంగ్రెస్ నేతలా కేసీఆర్ గురించి మాట్లాడేది? మంత్రుల అవినీతి సంపాదన చిట్టా మా దగ్గర ఉంది. ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర మంత్రులు కమిషన్ తీసుకుంటున్నారు. కేసీఆర్ తమ దగ్గర డబ్బులు తీసుకున్నారని ఎవరూ ఇంతవరకు అనలేదు.
పంటలను కాపాడుకోవడానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు మనకు దక్కాల్సిన కృష్ణా జలాలు దక్కాలి. ఇందుకోసం బీఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుంది. చంద్రబాబు సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను మరో పోలవరం ప్రాజెక్ట్ లుగా మారుస్తున్నారు. మంత్రులు కృష్ణా జలాలపై సోయి లేకుండా సొల్లు పురాణం చెబుతున్నారు. కాళేశ్వరాన్ని ఎండబెట్టారు కనుకే గతంలో మాదిరి సూర్యాపేట, మహబూబా బాద్ జిల్లాలకు నీళ్లు రావడం లేదు. ఎస్ఆర్ఎస్పీ నీళ్లే అయితే ఇప్పుడు మాకు నీళ్లు ఎందుకు రావడం లేదు?
శ్రీరామ్ సాగర్ నీళ్లు ఎందుకు రావడం లేదో చర్చిద్దాం రండి. కేసీఆర్ ను తిట్టడం బంద్ చేసి కృష్ణా జలాల వాటాను సాధించుకోవడం మీద మంత్రులు దృష్టి పెట్టాలి. కేసీఆర్ హయాంలో పదిహేడు పంట సీజన్లకు నీళ్లిచ్చాము. కేసీఆర్ హయాంలో ఏపీకి నీళ్లు అక్రమంగా తరలిస్తే ఇన్ని పంటలు పండటం సాధ్యమా? పెరిగిన పంట విస్తీర్ణం, పంట ఉత్పత్తే కేసీఆర్ హయాంలో సాగు నీళ్లు సక్రమ వాడకమే కారణం.
Also Read : తెలంగాణలోని రైతులకు శుభవార్త.. అసైన్డ్ భూములపై కీలక నిర్ణయం!
ఊరి సర్పంచ్ కు కూడా సమాధానం చెప్పలేని స్థాయి కాంగ్రెస్ నేతలది. వీళ్లా కేసీఆర్ గురించి మాట్లాడేది? ఇప్పటికైనా సోయి తెచ్చుకుని సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. అసలు నీళ్లను ఎలా కొలుస్తారో కాంగ్రెస్ నేతలకు తెలుసా? తెలంగాణ ప్రజలకు ఉద్యమం నుంచే టీఎంసీల గురించి కేసీఆర్ అవగాహన కల్పించారు. కేసీఆర్ ను విమర్శించడానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు సిగ్గుండాలి.
కేంద్ర మంత్రులుగా ఉన్న వారు కేఆర్ఎంబీ అధికారులతో మాట్లాడి తెలంగాణకు రావాల్సిన నీళ్లు సాధించడం చేతకాదా?
కేసీఆర్ హయాంలో పాలమూరు నుంచి వలసలు ఆగాయా లేదా? నల్లగొండ నుంచి ఫ్లోరోసిస్ భూతం పోయిందా లేదా? బీజేపీ నేతలు తెలుసుకోవాలి. కోమటి రెడ్డి మీడియాతో మాట్లాడే ముందు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకునేందుకు ఆయన నోట్లో పైపు పెట్టాలి” అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు.