Ravindra Naik : మోదీ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశారు, కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసారు : రవీంద్ర నాయక్
నరేంద్రమోదీ సభకు నాకు ఆహ్వానం లేదు. మోదీ ఈ సభ సందర్భంగా నాకు అవమానం జరిగింది.కేసీఆర్ పాలనలో అవినీతి జరిగిందని మోదీ అంటున్నారు..ఆరోపణలు చేయటమే కాదు దీన్ని సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాలి.

Former MP Ravindra Naik
Ravinder Naik Dharavath: కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీపై మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15లోపు కేసీఆర్ (KCR) పై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. హన్మకొండ (Hanamkonda)లో జరిగిన నరేంద్ర మోదీ (Narendra Modi) సభకు తనకు ఆహ్వానం లేదని.. ఈ సభ సందర్భంగా తనకు అవమానం జరిగిందని వాపోయారు. కేసీఆర్ పాలనలో అవినీతి జరిగిందని మోదీ అంటున్నారు.. ఆరోపణలు చేయటమే కాదు దీన్ని సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలోకి వచ్చింది కేవలం కేసీఆర్ ఓడించేందుకేనని అన్నారు. సామాజిక న్యాయం, స్వాభిమానం, స్వయం పాలన కోసం తెలంగాణ పోరాటం చేశాం కానీ, అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మాత్రం ఇవేమీ చేయలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో న్యాయం జరగటం లేదన్నారు. దేశ సంపాదన దోచుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఎటువంటి ఆధారాలు లేకుండా విమర్శలు చేయరు.. వెంటనే సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశారు కానీ, కేసీఆర్ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపిస్తే గిరిజన మహిళ సీతక్కను సీఎం చేస్తామని రేవంత్ రెడ్డి అనడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక డైనమిక్ అంటూ ప్రశంసించారు. బీసీలు ఎదుగుతున్న సమయంలో బీజేపీ అధిష్టానం బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుండి తప్పించడం అన్యాయమన్నారు. సంజయ్ ని తొలగిస్తే మరో బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు.