Marriage Incentive: పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు.. ప్రభుత్వం గుడ్ న్యూస్… జీవో జారీ
పెళ్లి తర్వాత కొత్తగా జీవితాన్ని ప్రారంభించే దంపతులకు నివాసం, వైద్య ఖర్చులు, ఇతర కనీస అవసరాలకు ఈ మొత్తం సాయంగా ఉంటుందన్నది ప్రభుత్వం ఆలోచన.
Marriage Incentive Representative Image (Image Credit To Original Source)
- దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు భారీగా పెంపు
- లక్ష రూపాయల నుంచి 2 లక్షలకు పెంపు
- దివ్యాంగుల సంక్షేమానికి పెద్ద పీట
Marriage Incentive: దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదును భారీగా పెంచింది. గతంలో లక్ష రూపాయలుగా ఉన్న ప్రోత్సాహక నగదును ఏకంగా 2 లక్షలకు పెంపు చేసింది. ప్రోత్సాహక నగదును పెంచుతూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగుల జీవన భద్రత, సామాజిక గౌరవం, ఆర్థిక స్వావలంబన తమ లక్ష్యం అని ప్రభుత్వం తెలిపింది.
దివ్యాంగుల వివాహానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆర్థిక సాయం భార్య పేరున బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పెళ్లి తర్వాత కొత్తగా జీవితాన్ని ప్రారంభించే దివ్యాంగ దంపతులకు నివాసం, వైద్య ఖర్చులు, ఇతర కనీస అవసరాలకు ఈ మొత్తం సాయంగా ఉంటుందన్నది ప్రభుత్వం ఆలోచన. దివ్యాంగుల జీవితాల్లో సామాజిక భద్రతతో పాటు ఆర్థిక భరోసా కల్పించాలన్నది ప్రభుత్వం లక్ష్యం.
శారీరక వైకల్యం ఎదుగుదలకు అడ్డు కాకూడదన్నది ప్రభుత్వం ఉద్దేశం. ఇందులో భాగంగా దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతోంది. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలు, మూడు చక్రాల సైకిళ్లు, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలను వంటి పరికరాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లోనూ దివ్యాంగులకు రిజర్వేషన్లు కేటాయించింది. ఇలా దివ్యాంగుల ఆత్మస్థైర్యం పెంచేలా చర్యలు తీసుకుంటోంది. వారు సమాజంలో గౌరవంగా జీవించేలా చేయడమే తమ ప్రధాన ఉద్దేశ్యం అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
భద్రత, స్థిరత్వం తీసుకురావడమే లక్ష్యం..
”దివ్యాంగుల జీవితాల్లో భద్రత, స్థిరత్వం తీసుకురావడమే మా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. వివాహం తర్వాత దివ్యాంగ దంపతులు ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించి, వారు గౌరవప్రదమైన జీవితం గడపడానికి, నివాసం, వైద్య ఖర్చుల నిమిత్తం ఈ నగదు ప్రోత్సాహకం ఎంతగానో దోహదపడుతుంది. దివ్యాంగుల ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. సీఎం రేవంత్ నాయకత్వంలో దివ్యాంగుల సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నాం” అని దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
Also Read: ఈపీఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. ఇకపై UPI నుంచే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఎప్పటినుంచంటే?
