మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు..
మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లకు మార్కింగ్, కూల్చివేతలపై రంగనాథ్ స్పందించారు.

Hydra Commissioner AV Ranganath (Photo Credit : Google)
Av Ranganath : మూసీ నది సర్వేలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మూసీ నివాసితులను హైడ్రా తరలించడం లేదన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేయటం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయటం లేదని తేల్చి చెప్పారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్ట్ అని, దాన్ని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేపడుతోందని ఆయన వెల్లడించారు.
కూల్చడం తప్ప నిర్మించడం రాదు- సీఎం రేవంత్ పై హరీశ్ ఫైర్
మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. పేదల ఇళ్లను కూల్చివేస్తామని ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. పేదలు కన్నీరుమున్నీరవుతున్నారని, వారి రోదనలు చూసైనా సీఎం రేవంత్ గుండె కరగటం లేదన్నారు. సీఎం రేవంత్ కి కూల్చడం తప్ప నిర్మించడం రాదని ధ్వజమెత్తారు. హైడ్రా పేరిట చేస్తున్న డ్రామాలు వెంటనే ఆపాలన్నారు. పేదల తరుపున అసెంబ్లీలో ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు హరీశ్ రావు.
”కూలగొట్టుడు తప్ప కట్టుడు తెల్వదు. 20వేల ఇళ్లు కూలగొట్టి సుందరీకరణ చేస్తాడట. బ్యాంకుల్లో అప్పులు తెచ్చి, రూపాయి రూపాయి జమ చేసుకుని కట్టుకున్న ఇళ్లను కూలగొట్టే కార్యక్రమం చేపట్టారు. పోనీ దాని వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? పది మందికి ఉద్యోగం వచ్చేదా? రైతులకు నీళ్లు పారేవా? బతుకలు బాగు పడలేదంటే సుందరీకరణ అంటున్నారు” అంటూ సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు హరీశ్ రావు.
Also Read : ఆ 30వేల మంది భారతీయులు ఏమయ్యారు? ఆందోళనకు గురిచేస్తున్న సైబర్ స్లేవరీ..