Jupally Krishna Rao: కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు .. పార్టీ కండువాకప్పి ఆహ్వానించిన ఖర్గే
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

Jupally Krishna Rao
Jupalli Krishna Rao joined Congress party: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే (Mallikharjuna Kharge) జూపల్లి కృష్ణారావుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాద్ రెడ్డి (Former MLA Gurunad Reddy), ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్వర్ రెడ్డితోపాటు వనపర్తి, పెద్దమందడి ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, మరికొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు థాక్రె, కేసి వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్, వంశీచందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
కొద్దికాలంగా జూపల్లి కాంగ్రెస్లో చేరిక వాయిదా పడుతూ వస్తుంది. గత నెల ప్రారంభంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక సందర్భంలోనే జూపల్లి, ఆయన వర్గీయులు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. కానీ, కొల్లాపూర్ నియోజకవర్గంలో బహిరంగ ద్వారా రాహుల్, ప్రియాంక గాంధీల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని జూపల్లి కృష్ణారావు భావించారు. ఈ క్రమంలో నెల 30న కొల్లాపూర్లో సభ ఖరారైంది. ప్రియాంక గాంధీ ఈ సభలో పాల్గొనాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సభ వాయిదా పడింది. దీంతో, పార్టీలో చేరిక ఆలస్యమవుతుండటంతో రాష్ట్ర పార్టీ పెద్దల సూచనల మేరకు ఢిల్లీ వెళ్లి ఖర్గే సమక్షంలో గురువారం జూపల్లి, తదితరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Jupally Krishna Rao: కాంగ్రెస్ ముఖ్యనేతలతో జూపల్లి వరుస భేటీలు.. పార్టీలో చేరిక ఎప్పుడంటే..?
వాస్తవానికి జూపల్లి, ఆయన అనుచరులు బుధవారమే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాల్సి ఉంది. ఇందుకోసం మంగళవారమే వీరు ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే షెడ్యూల్ బిజీగా ఉండటంతో చేరికలు కుదరలేదు. దీంతో గురువారం ఉదయం వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు.