కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. టిప్పర్ బోల్తా.. మట్టిలో కూరుకుపోయి ముగ్గురు దుర్మరణం

బోర్నపల్లిలో బోనాల జాతరకు హాజరైన బైక్ ముగ్గురు ఇంటికి వెళ్తున్నారు. ఎలబోతారం నుంచి హుజారాబాద్ వైపు మట్టి లోడుతో వస్తున్న టిప్పర్..

కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. టిప్పర్ బోల్తా.. మట్టిలో కూరుకుపోయి ముగ్గురు దుర్మరణం

Karimnagar district tragedy

Updated On : April 6, 2024 / 10:23 AM IST

Karimnagar : కరీంనగర్ జిల్లా హుజారాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. మట్టితో అతివేగంగా వెళ్తున్న టిప్పర్ మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెలు, మరో అమ్మాయి మట్టి కిందపడి మరణించారు. బోర్నపల్లిలో పెద్దమ్మ బోనాల జాతర గత మూడు రోజులుగా జరుగుతుంది. జాతరలో పాల్గొన్న గంటా విజయ్ (17), గంటా వర్ష (15), సింధూజ (18)లు గుడి నుంచి బైక్ పై ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read : Cm Ramesh : అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పై కేసు నమోదు.. కారణం ఏంటంటే..

బోర్నపల్లిలో బోనాల జాతరకు హాజరైన వారు.. జాతర అనంతరం బైక్ పై ఇంటికి వెళ్తున్నారు. ఎలబోతారం నుంచి హుజారాబాద్ వైపు మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ ను చూసి మూలమలుపు వద్ద ఆగారు. టిప్పర్ వేగంగా రావడంతో మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. దీంతో టిప్పర్ లో ఉన్న మట్టి ముగ్గురిపై పడింది. గమనించిన గ్రామస్తులు మట్టిని తొలగించి వర్షను బయటకు తీసి 108 లో హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించి మరణించినట్లు తెలిపారు. మట్టిలో కూరుకుపోయిన మరో ఇద్దరు విజయ్, సింధూజలను జేసీబీ సాయంతో మట్టిని పక్కకు నెట్టి బయటకు తీశారు. అప్పటికే వారు ఊపిరాడక మరణించారు.

Also Read : Cyber Crimes : పెండింగ్ చ‌లాన్లు చెల్లిస్తున్నారా..? ఈ విష‌యం తెలుసుకోండి

మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావటంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. విజయ్, వర్ష సొంత అన్నాచెల్లెలు, సింధూ వీరి పెదనాన్న కూతురు. అయితే, ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది.