సీఎంకి 2 ఇళ్లు, డిప్యూటీ సీఎంకి 3 ఇళ్లు ఉండొచ్చు.. పేదల ఇళ్లు కూలగొడతారా?: కేటీఆర్
KTR : సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు.. సీఎం రేవంత్ రెడ్డి ఇండ్లు కూలగొట్టడం మానుకొని.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
KTR
KTR : సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు.. సీఎం రేవంత్ రెడ్డి ఇండ్లు కూలగొట్టడం మానుకొని.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేల మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాల ఇండ్లను కూల్చివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ బాధితులు హైదరాబాద్ షా కోట్లో ‘మూసీ దండి మార్చ్’ పాదయాత్ర చేపట్టారు. కేటీఆర్ ఈ పాదయాత్రలో పాల్గొని బాధితులతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
హైద్రాబాద్ ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ప్రజలు ఇవ్వలేదు. గ్రామీణ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇండ్లు కూలగొట్టడం కాదు.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. హైడ్రా పేరుతో కూడా ఇండ్లు కూల్చారు. చిన్న పిల్లలు గల్ల బుడ్డి ఇచ్చి రేవంత్ రెడ్డికి ఇవ్వమని చెబుతున్నారు.. రేవంత్ రెడ్డిలా అక్రమ సంపాదనతో కట్టుకున్న ఫ్యాలెస్లు ఇక్కడి ప్రజలకు లేవని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసి ఆయన చేతిలో పెట్టి వెళ్ళాం.. కానీ, రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిని పాతాళానికి తీసుకెళ్లాడంటూ కేటీఆర్ విమర్శించారు.
ముఖ్యమంత్రి విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నాడు. ఆయన కోట కంచెకు తొమ్మిది కోట్లు. ఉప ముఖ్యమంత్రికి మూడు ఇండ్లు, ముఖ్యమంత్రి రెండు ఇండ్లు ఉండాలి. పేదవారికి మాత్రం ఇండ్లు ఉండకూడదు.. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైద్రాబాద్ లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు. డీపీఆర్ లేకుండా ఇండ్లును ఎలా కూలుస్తారంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం అంటున్నారు.. మరి తెలంగాణలో ఏంది అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొండగల్లో కుంటలో ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు బఫర్ జోన్లో ఉంది. ఇక్కడ మాత్రం వేల కుటుంబాలను రోడ్డున పడేయాలని చూస్తున్నారు. రెండేళ్లు మీరు మీ భూములను, ఇండ్లను కాపాడుకోండి.. రెండేళ్లలో మేము అధికారంలోకి వస్తాం. మీ ఇంటికి సున్నం కూడా పోకుండా మేము చూసుకుంటామని కేటీఆర్ అన్నారు. ఈ దుర్మార్గుడి నుంచి తెలంగాణను కాపాడుకోవాలి. ఏసీలో కూర్చోవద్దు.. అవసరం అయితే ప్రతి ఒక్కరూ ప్రజలకోసం బయటకు రండి అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.
