Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్న్యూస్.. తెలంగాణలో ఐదు రోజులు, ఏపీలో రెండు రోజులు
గత వారంరోజులుగా ఎండలతో రెండు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా వారికి ఉపశమనం కలిగించేలా వాతావరణ శాఖ ఒక ప్రకటన చేసింది.

Weather report
Telugu States Rains Alert : తెలుగు రాష్ట్రాలు నిప్పలకుంపటిగా మారిపోయాయి. భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఫలితంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 45డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భగ్గుమంటున్న భానుడితో ఒకవైపు, తీవ్ర వడగాల్పులతో మరోవైపు బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పలుప్రాంతాల్లో అత్యవసరమైతే తప్ప పగటి వేళ బయటకు రావొద్దని, వచ్చినా వడదెబ్బ భారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలుసైతం జారీ అయ్యాయి. గత వారంరోజులుగా ఎండలతో రెండు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా వారికి ఉపశమనం కలిగించేలా వాతావరణ శాఖ ఒక ప్రకటన చేసింది.
Cold Weather : చల్లని వాతావరణం అనారోగ్యానికి గురి చేస్తుందా? ఇందులో వాస్తవ మెంత ?
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. గురువారం రాత్రి ఈ మేరకు వెదర్ బులిటెన్ విడుదల చేశారు. ఈ వివరాల ప్రకారం.. శుక్రవారం (మే19) నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయి.
వాతావరణం కేంద్రం వివరాల ప్రకారం ..
– 19న నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 20న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
– 21న తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
– 22న ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా 23 తేదీకూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో ఇలా..
ఏపీలోని పలు జిల్లాల్లో వచ్చే రెండురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. బంగాళాఖాతం నుంచి తమ గాలులు రాయలసీమ, కోస్తా జిల్లాల్లోకి వీస్తున్నాయి. ఈ ప్రభావంతో కోస్తాలోని జిల్లాలతో పాటూ రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతితో పాటు పలు జిల్లాల్లో గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు కొద్దిసేపు చల్లటి గాలులతో ఉపశమనం పొందారు.