Rain Alert: తెలంగాణలో నాలుగు రోజులు వానలే వానలు.. ఇవాళ ఆ జిల్లాల్లో కుండపోత వర్షం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Telangana Rain Alert
Rain Alert: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ శనివారం వర్షం కురిసింది. ముఖ్యంగా జనగామ, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే, మరో నాలుగు రోజులపాటు తెలంగాణలో వానలు కుమ్మేస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, సోమ, మంగళవారాల్లో అతిభారీ వర్షాలు, బుధవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములతో కూడిన వర్షాలతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఇవాళ (20వ తేదీ) రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రేపు (21వ తేదీ) ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
22వ తేదీ (మంగళవారం) భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.