Hyderabad :9 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్ చేసిన వివాదస్పద వ్యాఖ్యల కేసులో కాసేపట్లో తుది తీర్పు..పాతబస్తీలో హై అలర్ట్

9 ఏళ్ల క్రితం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసి వివాదస్పద వ్యాఖ్యల కేసులో కోర్టు కాసేపట్లో తుది తీర్పు వెలువరించనుంది. దీంతో పాతబస్తీలో పోలీసు యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది

Hyderabad :9 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్ చేసిన వివాదస్పద వ్యాఖ్యల కేసులో కాసేపట్లో తుది తీర్పు..పాతబస్తీలో హై అలర్ట్

Judgement On Mim Mla Akbaruddin Owaisi Hate Speech Today

Updated On : April 12, 2022 / 11:43 AM IST

Hyderabad : ఆవేశంతోనో..దురుద్ధేశంతోనే చేసిన వ్యాఖ్యలు గత తొమ్మిదేళ్లుగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ను వెంటాడుతునే ఉన్నాయి. అక్బరుద్ధీన్ తొమ్మిదేళ్ల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయిన నిర్మల్ లోను, నిజామాబాద్ పర్యటనలోను హిందువులపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయటంతో జైలుకు పంపించటం కూడా జరిగింది. ఈ కేసు విషయంలో నాంపల్లి కోర్టు సుదీర్ఘ విచారణను కొనసాగించింది. ఈ కేసు విషయంలో 30మంది సాక్షుల్ని విచారించింది. సీఐడీ చార్జ్ షీట్ లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును అధికారులు ప్రస్తావించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ఈరోజు తుది తీర్పు వెల్లడించనుంది. అసలు రంజాన్ మాసం కావటం..దీనికి తోడు అక్బరుద్ధీన్ కు కోర్టు శిక్ష విధిస్తే ఓల్డ్ సిటీలో శాంతి భద్రతల సమస్య రావచ్చనే ముందస్తు జాగ్రత్తతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

కాగా అక్బరుద్దీన్ ఒవైసీ 9ఏళ్ల క్రితం చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనాన్ని రేకెత్తించాయి. ఈ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయటం..అక్బరుద్ధీన్ ను కొంతకాలం జైలుశిక్ష విధించటం బెయిల్ పై బయటకు రావటం జరిగింది. అలా దాదాపు దశాబ్ద కాలం పాటు కోర్టులో విచారణ కొనసాగింది. ఈరోజు (ఏప్రిల్ 12,2022)ఈ కేసుకు సంబంధించి హైదరాబాదులోని నాంపల్లి కోర్టు తుది తీర్పును వెలువరించనుంది. కోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వబోతుందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. పైగా ఇది రంజాన్ మాసం కావడంతో… అక్బరుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా తీర్పు వస్తే శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి.

కేసు వివరాల్లోకి వెళ్తే… 9 ఏళ్ల క్రితం నిర్మల్ మున్సిపల్ గ్రౌండ్స్ లో అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తూ.. ‘మీరు 100 కోట్ల మంది. మేము కేవలం 25 కోట్ల మంది మాత్రమే. ఒక్క 15 నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువో, ఎవరు తక్కువో చూపిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వివాదాస్పద ప్రసంగం ప్రకంపనలు రేపింది. దీంతో పాటు హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఐపీసీ 120-బీ, 153-ఏ, 295, 298, 188 సెక్షన్ల కింద పోలీసులు సుమోటోగా కేసులు పెట్టారు. అంతే కాదు… ఈ కేసులో ఒవైసీ ఇప్పటికే 40 రోజుల పాటు జైలు శిక్షను కూడా అనుభవించారు.