YSRTP: పొంగులేటి వైఎస్సార్ ఫ్యామిలీకి అభిమాని.. మా పార్టీలో చేరేందుకు గేట్లు తెరిచే ఉంటాయి: వైఎస్సార్టీపీ
YSRTP: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఏ పార్టీలో చేరనున్నారు అన్న ఉత్కంఠ నెలకొన్న వేళ వైఎస్సార్టీపీ కీలక వ్యాఖ్యలు చేసింది.

YSRTP
YSRTP: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy)పై వైఎస్సార్టీపీ పీఏసీ సభ్యుడు గట్టు రామచంద్ర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) పొలిటికల్ యాక్షన్ కమిటీ ఇవాళ సమావేశమై పలు అంశాలపై చర్చించింది. సమావేశం ముగిసిన అనంతరం వైఎస్సార్టీపీ పీఏసీ సభ్యుడు గట్టు రామచంద్ర రావు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
“ఖమ్మం జిల్లాలో పొంగులేటి కీలక వ్యక్తి. ఖమ్మం రాజకీయాల్లో సత్తా ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన ఏ పార్టీలో వెళ్తాడు అనేది ఆయన ఇష్టం. మా పార్టీలో చేరేందుకు ఎప్పుడూ గేట్లు తెరిచే ఉంటాయి. పొంగులేటి వైఎస్సార్ కుటుంబానికి అభిమాని. రాజకీయాల కోసం కాకున్నా ఎప్పుడు కలుస్తూనే ఉంటారు” అని చెప్పారు.
తమ పార్టీపై నిర్బంధం కొనసాగుతోందని, తమను అడుగు బయట పెట్టనీయడం లేదని చెప్పారు. తమ పార్టీ ఆఫీసుకి తాము రావడానికి కూడా అనుమతి అంటున్నారని తెలిపారు. తమ పార్టీ నేతల ఇళ్ల దగ్గర కూడా పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని చెప్పారు. షర్మిల మీద ఎందుకు ఈ నిర్బంధ కాండ అని ప్రశ్నించారు.
“మమ్మల్ని చూస్తే కేసీఆర్ కి వణుకు పుడుతుంది. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నాం. అన్ని వర్గాల వారిని కలుపుకొని పోరాటం చేస్తున్నాం. అఖిలపక్షం అధ్వర్యంలో ఇవాళ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన దీక్షకు అనుమతి ఇవ్వలేదు. చివరి వరకు అనుమతి పెండింగ్ లో పెట్టి అనుమతి లేదని చెప్పారు. ఇందిరాపార్క్ ఉన్నదే ధర్నాలు, దీక్షలు చేయడానికి.
కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఇందిరాపార్క్ వద్ద ఎన్నో ధర్నాలు చేశారు. ఇందిరాపార్క్ వద్ద ఆందోళనలు చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షాల ఆందోళనలు తొక్కి పెట్టాలని చూస్తున్నారు. అధికార పక్షం ఎన్నైనా చేయొచ్చా? ప్రతిపక్షం మాత్రం ఆందోళనలు చేయోద్దా? దీక్షకు అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నాం.
కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటాం. ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగుల పక్షాన దీక్ష ఆపేది లేదు. అన్ని పార్టీల మద్దతు తీసుకుంటాం. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం. పోలీస్ శాఖను కూడా కలుస్తాం. లోటస్ పాండ్ వద్ద ఎందుకు ఈ పోలీస్ హడావిడి. మీడియాపై సైతం పార్టీ కార్యాలయం వద్ద ఆంక్షలు ఎందుకు? ఇప్పుడు ఢిల్లీలో బీఆర్ఎస్ (BRS) పార్టీ ధర్నాలు చేస్తోంది.
మీకో న్యాయం మాకో న్యాయమా? మా దీక్షకు 39 ప్రజా సంఘాల నుంచి మద్దతు ఉంది. మమ్మల్ని ఎందుకు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు? వైఎస్ షర్మిలను చూసి బీఆర్ఎస్ భయపడుతోంది. అందుకే మా గళాన్ని నొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు” అని వైఎస్సార్టీపీ పీఏసీ సభ్యుడు గట్టు రామచంద్ర రావు అన్నారు.