Telangana Politics : కేసీఆర్ను టెన్షన్ పెట్టిస్తున్న పీకే..సర్వే రిపోర్టులతో గులాబీ బాస్ అలెర్ట్
గులాబీ బాస్ కేసీఆర్కు కొత్త టెన్షన్ మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ఎమ్మెల్యేల బృందం పనితీరుపై ప్రశాంత్ కిషోర్ టీమ్ అందిస్తున్న రిపోర్టులు కేసీఆర్ను కంగారుపెట్టిస్తున్నాయనే ప్రచారం ఆపార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తున్న పీకే టీమ్.. కొందరు ఎమ్మెల్యేల జాతకాలు చిట్టా కేసీఆర్ చేతిలో పెట్టింది..ఈ రిపోర్టులు చూసి కేసీఆర్ తెగ టెన్షన్ పడుతున్నారట.
Telangana Politics : గులాబీ బాస్ కేసీఆర్కు కొత్త టెన్షన్ మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ఎమ్మెల్యేల బృందం పనితీరుపై ప్రశాంత్ కిషోర్ టీమ్ అందిస్తున్న రిపోర్టులు కేసీఆర్ను కంగారుపెట్టిస్తున్నాయనే ప్రచారం ఆపార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తున్న పీకే టీమ్.. కొందరు ఎమ్మెల్యేల జాతకాలు చిట్టా కేసీఆర్ చేతిలో పెట్టింది.. మెజార్టీ సీట్లలో విజయం సాధించాలంటే అభ్యర్థుల మార్పు తప్పదనే నిర్ణయానికి గులాబీ బాస్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. సీఎం కేసీఆర్ను కంగారు పెట్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పీకే టీమ్ చేస్తున్న సర్వే రిపోర్టులు సీఎం చేతిలో పెట్టి టెన్షన్ పుట్టిస్తున్నారు. మూడోసారి అధికార పగ్గాలు దక్కించుకునేందుకు తహతహలాడుతున్న గులాబీ పార్టీ.. పీకే రిపోర్టులతో అలెర్ట్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మార్పులు చేయక తప్పదనే నిర్ణయానికి గులాబీ బాస్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఎన్నికల క్షేత్రంలో పీకే టీమ్ పలు రాష్ట్రాల్లో ఏ పార్టీకి సేవలందించినా ఆ పార్టీ 90 శాతానికి పైగా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. దీంతో పీకే సేవలను వినియోగించుకునేందుకు గులాబీ పార్టీ ఒప్పందం చేసుకుంది. దాదాపు ఆరు నెలలుగా టీమ్ సభ్యులు దాదాపు అన్ని నియోజకవర్గాలను ఇప్పటికే జల్లెడ పట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రుల బలాబలాలపై పూర్తిస్థాయి నివేదికలను పార్టీ అధినేత చేతిలో పెట్టారు. పీకే బృందం ఇచ్చిన నివేదికలు గులాబీ బాస్ కేసిఆర్ కు ఆశ్చర్యపోయేలా చేశాయన్న చర్చ అధికార పార్టీలో హాట్హాట్గా మారింది. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో అధికారాలు అప్పగించడంతో ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న విధానాలపై సమగ్ర సమాచారం కేసీఆర్ చేతికి అందింది.
మరోసారి అధికారపగ్గాలు దక్కించుకోవాలంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారి పనితీరును మూడు విభాగాలుగా పీకే బృందం అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో సులువుగా విజయం సాధించే అభ్యర్థులు, కొద్దిగా కష్టపడితే విజయం సాధించే అభ్యర్థులు, కష్టపడ్డా ఫలితం సానుకూలంగా వచ్చే అవకాశం లేని నియోజకవర్గాల లిస్ట్ను సీఎంకు ఇచ్చినట్లు తెలుస్తోంది. 30 నుంచి 40 నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులు సులువుగానే విజయం దక్కించుకునే అవకాశం ఉందని తేల్చినట్లు తెలుస్తోంది. మరో 25 నుంచి 35 నియోజకవర్గాల్లో అభ్యర్థులు గట్టి పోటీ ఎదుర్కొంటారని గెలుపు ఓటముల్లో ఎలాంటి ఫలితం అయినా రావచ్చని అంచనా వేసినట్లు తెలుస్తోంది.
30 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో భారీఎత్తున వ్యతిరేకత ఉందని, దాన్ని అధిగమించడం కష్టమేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు వారు వ్యక్తిగతంగా అనుసరిస్తున్న వైఖరిపై కూడా పీకే టీమ్ నివేదికలను సీఎం కేసీఆర్కు ఇచ్చారు. నల్లగొండ, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేల అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారనే చిట్టా పార్టీ అధినేతకు అందినట్లు తెలుస్తోంది. పలువురు నేతల లైంగిక సంబంధాల అంశాలు కూడా పార్టీ అధినేత వరకు వెళ్లినట్లు సమాచారం.
Also read : Secunderabad Protests: సుబ్బారావు రిమాండ్పై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలేం జరుగుతుందంటే..
ఇప్పటి వరకు కేవలం ఇంటెలిజెన్స్ నివేదికలపై ఆధారపడ్డ సీఎం కేసిఆర్.. పీకే టీమ్ ఇస్తున్న నివేదికలపై సీరియస్గా దృష్టి సారించినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. సిట్టింగ్ల గెలుపు సాధ్యం కాదని వస్తున్న సర్వేలతో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతకు ఎవరనే విషయం కూడా స్పష్టంగా చెప్తోంది పీకే టీమ్. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో.. పరిస్థితులు చక్కదిద్దుకునే అవకాశాలున్న నియోజకవర్గాలపై పార్టీ పెద్దలు కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కీలక నేతలు జిల్లాల్లో ఇటీవల విస్తృతంగా పర్యటిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ఎన్నికలకు దాదాపు రెండేళ్ల ముందుగానే గులాబీ బాస్ కసరత్తు మొదలుపెట్టడంతో.. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో భారీ మార్పులు జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల నాటికి నియోజకవర్గాల్లో పరిస్థితులు మారకపోతే సిట్టింగ్ల ఆశలు గల్లంతేనని తేల్చి చెప్తున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. మొత్తమ్మీద అధినేత కేసీఆర్కు పీకే టీమ్ ఇచ్చిన చిట్టా కొంత మంది సిట్టింగ్లను కలవరపడేలా చేస్తోందని పార్టీలో అంతా చర్చించుకుంటున్నారు.