Revanth Reddy: ప్రగతి భవన్ పేరు మారుస్తాం.. ఘన విజయం అనంతరం రేవంత్ తొలి కామెంట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

Revanth Reddy: ప్రగతి భవన్ పేరు మారుస్తాం.. ఘన విజయం అనంతరం రేవంత్ తొలి కామెంట్

ప్రగతి భవన్ పేరును డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ స్మారక భవనంగా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని విపక్ష పార్టీలన్నింటినీ కలుపుకుని పోతామని రేవంత్ రెడ్డి అన్నారు.

‘‘ఇవాళ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చి శ్రీకాంతాచారికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత తెలిపే అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికి కృతజ్ఞతలు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం అప్పగించి మాపై మరింత బాధ్యతను పెంచారు. జోడో యాత్ర ద్వారా తెలంగాణలో రాహుల్ గాంధీ స్ఫూర్తిని నింపారు. తెలంగాణతో తమది కుటుంబ అనుబంధమని చెప్పి రాహుల్ గాంధీ ప్రజల్లో విశ్వాసం నింపారు. రాహుల్ గాంధీ అండతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తాం. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షాలు హేతుబద్ధంగా వాదించేందుకు కాంగ్రెస్ అవకాశం ఇస్తుంది. ప్రజల తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి విపక్షాలతోపాటు అందరినీ ఆహ్వానిస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. ప్రభుత్వంలో సీపీఐ, జనసమితి ఆలోచనలను స్వీకరిస్తాం. కూటమి గెలుపుకు సహకరించినందుకు సీపీఐ, కోదండరాం గారికి కృతజ్ఞతలు’’ అని అన్నారు.

ఇక బీఆర్ఎస్ గురించి రేవంత్ స్పందిస్తూ.. ‘‘ప్రజా తీర్పును బీఆరెస్ శిరసావహించాలి. ప్రభుత్వ ఏర్పాటుకు బీఆరెస్ వైపు నుంచి సహకారం ఉంటుందని, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సహకరిస్తుందని ఆశిస్తున్నాం. పరిపాలన ఇక గతంలోలా ఉండబోదు. సచివాలయ గేట్లు సామాన్యులకు తెరిచే ఉంటాయి. ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ స్మారక భవన్ గా మారుస్తాం. ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు.. ప్రజా భవన్. సామాన్యులకు అందులో ప్రవేశం ఉంటుంది. కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.